వైఎస్ సీఎం అవ్వక పోతే జగన్ వార్డు కౌన్సిలర్ గా కూడా గెలవలేడు!
Publish Date:Mar 8, 2025
Advertisement
కార్పొరేటర్ కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి చేసి వ్యాఖ్య బూమరాంగ్ అయ్యింది. పవన్ కల్యాణ్ ప్రాధాన్యతను తగ్గించడమే లక్ష్యంగా జగన్ చేసిన ఆ వ్యాఖ్య తో తెలుగుదేశం, జనసేన వర్గీయులు జగన్ పై ఫైర్ అవుతున్నారు. జనసేన సీనియర్ నాయకుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ కోడికత్తికి తక్కువ.. గొడ్డలికి ఎక్కువ అంటూ చురకలంటించారు. అదే విధంగా జనసేన, తెలుగుదేశం నేతలు కూడా జగన్ వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా.. జగన్ స్థాయిని ప్రశ్నించారు. తాజాగా తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాసరావు.. జగన్ ది వార్డు కౌన్సిలర్ స్థాయి కూడా కాదంటూ ఇచ్చి పాడేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డిని కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేయకుండా ఉండి ఉంటే జగన్ కనీసం వార్డు కౌన్సిలర్ గా కూడా గెలిచి ఉండేవారు కాదని విమర్శించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ ను కడప నుంచి లోక్ సభ అభ్యర్థిగా గెలిపించారనీ గుర్తు చేశారు. ఆ తరువాత కూడా వైఎస్ చావును అడ్డుపెట్టుకుని ప్రజలలో సానుభూతి సంపాదించి ముఖ్యమంత్రి అయ్యరే కానీ స్వతహాగా జగన్ కు అంత సీన్ లేదని బోలిశెట్టి శ్రీనివాసరావు అన్నారు. అటువంటి జగన్ కు ప్రజల కోసం కష్టపడి పని చేస్తున్న పవన్ కల్యాణ్ గురించి మాట్టాడే అర్హత లేదన్నారు.
http://www.teluguone.com/news/content/if-ys-was-not-cm-jagan-cant-win-as-ward-counciler-39-194080.html





