రుషి కొండ ప్యాలెస్ వినియోగం ఎలా.. కేబినెట్ సబ్ కమిటీ తుది సమావేశం తేలుస్తుందా?
Publish Date:Jun 17, 2026
Advertisement
విశాఖపట్నంలోని అందమైన రుషికొండకు బోడి గుండు కొట్టి మరీ, గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన ప్యాలెస్ భవితవ్యం ఏమిటో తేలిపోనున్నది. రిషికొండ ప్యాలెస్ లగ్జరీ భవనాల వినియోగం, ఆదాయాన్ని రాబట్టడం ఎలా? అన్న విషయంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల సబ్ కమిటీ కసరత్తు తుది దశకు వచ్చింది. విశాఖలోనే మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాల వీరాంజనేయస్వామి సభ్యులుగా ఉన్న ఈ సబ్ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా వచ్చిన ప్రతిపాదనలను, నివేదికలను పరిశీలించింది. బుధవారం జరిగే భేటీలో అధికారుల అభిప్రాయాలను సేకరించి, భవనాల వాడకంపై ఒక స్పష్టమైన రోడ్మ్యాప్ను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ సమావేశం అనంతరం.. వచ్చే కేబినెట్ మీటింగ్లోనే కమిటీ నివేదిక ఆధారంగా ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అసలు రుషికొండ భవన నిర్మాణాల వెనుక ఉన్న లెక్కలు, వివాదాల విషయానికి వస్తే.. జగన్ హయాంలో.. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 453 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ ప్యాలెస్ నిర్మాణం జరిగింది. ఇంత భారీ స్థాయిలో ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన ఈ ప్యాలెస్ను వృథాగా వదిలేయకుండా.. వీలైనంత త్వరగా ప్రజా వినియోగంలోకి.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ప్రభుత్వ ఆదాయ మార్గాల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీటీడీసీ కూడా ఈ భవనాల నిర్వహణ కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ఈ భవన సముదాయంతో పాటు, దాని పక్కనే ఖాళీగా ఉన్న మరో 9 ఎకరాల భూమిని కూడా లీజుకు ఇస్తామని ప్రకటించడంతో దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పోటీ పడ్డాయి. ప్రముఖ తాజ్ గ్రూప్, విశాఖలో ఇప్పటికే బేపార్క్ను నిర్వహిస్తున్న ఫెమా గ్రూప్, అంతర్జాతీయ స్థాయి అట్మాస్పియర్ కోర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఈ ప్యాలెస్ దక్కించుకోవడానికి బిడ్లు దాఖలు చేశాయి. అయితే.. ఇక్కడే ఒక అనూహ్య ట్విస్ట్ ఎదురైంది. ఈ భవనాలను ఒక లగ్జరీ హస్పిటాలిటీ లేదా హోటల్ రంగం వైపు తిప్పాలని కమిటీ భావించినప్పటికీ.. అంతర్జాతీయ హోటల్స్ గ్రూప్స్ మాత్రం ఈ నిర్మాణాలు నేరుగా హోటల్ వ్యాపారానికి అనువుగా లేవని తేల్చి చెప్పాయి. ఈ ప్యాలెస్లో భారీగా మార్పులు చేర్పులు చేయాలని, లేదా మరికొన్ని కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇస్తేనే తాము ముందుకు వస్తామని అన్నాయి. అంతేకాకుండా.. ఏపీటీడీసీ ఆఫర్ చేసిన 9 ఎకరాల ఖాళీ స్థలంలో దాదాపు 7 ఎకరాల భూమి కోస్తా నియంత్రణ జోన్ అంటే సీఆఆర్ జడ్ పరిధిలోకి వస్తుందని అధికారులు గుర్తించారు. దీనివల్ల అక్కడ కొత్త నిర్మాణాలకు పర్యావరణ అనుమతులు రావడం కష్టం. దీంతో.. నిబంధనలను ఉల్లంఘించకుండా ఏ మేరకు మార్పులు చేయవచ్చు, ఏ రకమైన ప్రతిపాదనలు ఆచరణ సాధ్యమవుతాయనే కోణంలో సబ్ కమిటీ అధ్యయనం చేస్తోంది. ఈ కమిటీ సమగ్ర నివేదికను సీఎం చంద్రబాబునాయుడికి సమర్పిస్తుంది. ఆ తరువాతనే రుషికొండ ప్యాలెస్ భవిష్యత్ ఏమిటన్నది తేలుతుంది.
http://www.teluguone.com/news/content/cabinet-subcommittee-on-rushikonda-palace-final-meeting-36-223248.html





