బీఆర్ఎస్ ప్లీనరీ రద్దు.. పార్టీ శ్రేణుల్లో నిరాశ
Publish Date:Apr 27, 2026
Advertisement
తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేడు తన ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. సాధారణంగా ఆవిర్భావ దినోత్సవం రోజున రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ప్లీనరీ నిర్వహించడం, కేడర్లో ఉత్సాహం నింపాలని ఏ పార్టీ అయినా భావిస్తుంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తమ సత్తా చాటడానికి ఘనంగా, అట్టహాసంగా జరుపుకుంటాయి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అయితే.. ఆవిర్భావ దినోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహించి క్యాడర్ ను వచ్చే ఎన్నికల నాటికి సిద్ధం చేయడానికి అందివచ్చిన అవకాశంగా ఆవిర్భావ దినోత్సవాన్ని చూస్తుంది. అయితే తెలంగాణలో మాత్రం ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అందుకు భిన్నంగా.. వేసవి తీవ్రతను సాకుగా చూపుతూ ప్లీనరీని రద్దు చేసింది. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీని రద్దు చేయడంపై పార్టీలోనే భిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి. పైకి సామాజిక బాధ్యతతోనే ప్రజలు, కార్యకర్తల క్షేమాన్ని కాంక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తున్నా.. సాధారణంగా వేసవిలో కూడా సాయంత్రం వేళల్లో బహిరంగ సభలు నిర్వహించే సంప్రదాయం ఉందని, ఇటీవల జగిత్యాలలో జరిగిన సభే ఇందుకు నిదర్శనమనీ గుర్తు చేస్తున్నారు. ఆ సభకు పార్టీ అధినేత కేసీఆర్ కూడా హాజరైన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మొత్తంగా పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం రోజున బహిరంగ సభ జరపకపోవడం పట్ల పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ వ్యక్తం అవుతున్నది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ తన సత్తా చాటుకోవడానికి ప్లీనరీ కీలకమని అంటున్నారు. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో అధినేత కేసీఆర్ క్యాడర్కు దిశా నిర్దేశం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని అంటున్నారు. ఇలాంటి కీలక తరుణంలో కేసీఆర్ ప్రజల ముందుకు రాకపోవడం.. తన వాణిని వినిపించకపోవడం పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తన సొంత కుమార్తె కవిత తనపై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే కేసీఆర్ బహిరంగ సభ విషయంలో వెనక్కు తగ్గారన్న చర్చ కూడా రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. భారీ బహిరంగ సభకు బదులుగా తెలంగాణ భవన్లో కేవలం కీలక నేతలతో మాత్రమే ఇండోర్ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ తన పూర్వ వైభవాన్ని చాటుకోవడానికి ఈ ఆవిర్భావ దినోత్సవం ఒక వేదికగా మారుతుందని ఆశించిన కార్యకర్తలకు ఈ నిర్ణయం నిరాశను మిగిల్చింది.
http://www.teluguone.com/news/content/brs-plenary-cancelled-39-218370.html





