బోండా ఉమా వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం.. వివరణకు ఆదేశం..!
Publish Date:Jul 27, 2026
Advertisement
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..! ఆంధ్రప్రదేశ్ అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీలో అనూహ్య పరిణామాలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వైఖరిపై టిడిపి అధిష్టానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ శ్రేణుల్లో విస్మయానికి గురిచేసిన ఆయన ఇటీవలి వ్యాఖ్యలు, చేష్టలపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమై షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుతో కలిసి బోండా ఉమ ఒకే వేదికను పంచుకోవడం కూటమి వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. నిత్యం తెలుగుదేశం, జనసేన అధినేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తే ప్రత్యర్థి పార్టీ నేతతో సఖ్యతగా మెలగడం కూటమి ధర్మానికి విరుద్ధమని పార్టీ నాయకత్వం భావిస్తోంది. అంతేకాకుండా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాపు సామాజిక వర్గ ప్రయోజనాల కోసం స్వయంగా ఉద్యమిస్తానని బోండా ఉమ ప్రకటించడం కూటమి ప్రభుత్వానికి కొత్త ఇబ్బందులను తెచ్చిపెట్టింది. గతంలో ముద్రగడ పద్మనాభం వ్యవహారాన్ని టీడీపీ సరిగ్గా అంచనా వేయకపోవడం వల్లే 2019లో ఓటమి చవిచూసిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణులను కుదిపివేశాయి. విజయవాడ సెంట్రల్ నుండి రెండవసారి విజయం సాధించిన బోండా ఉమామహేశ్వరరావు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి పదవిని ఆశించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చురుగ్గా పోరాటాలు చేసిన తనకే ప్రాధాన్యం దక్కుతుందని ఆయన భావించారు. అయితే వివిధ సామాజిక, రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆయనకు కేబినెట్లో చోటు లభించలేదు. దీంతో గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న బోండా ఉమ, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. పరోక్షంగా అధిష్టానాన్ని లక్ష్యంగా చేసుకుంటూ క్రమశిక్షణ కట్టుదాటే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో సానుకూల వాతావరణం ఉన్న సమయంలో పార్టీ నేతలే వివాదాలకు కేంద్రబిందువు కావడం తగదని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. క్రమశిక్షణను ఉల్లంఘించే నాయకులు ఎంతటి వారైనా సహించేది లేదనే స్పష్టమైన సంకేతాన్ని పంపేందుకే ఈ షోకాజ్ నోటీసు ఇచ్చారని తెలుస్తోంది. పార్టీ జారీ చేసిన నోటీసుపై బోండా ఉమామహేశ్వరరావు ఏ విధంగా స్పందిస్తారనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఆయన ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే అధిష్టానం తదుపరి ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. Bonda Umamaheswara Rao, Ambati Rambabu, TDP Show Cause Notice, AP Politics, Chandrababu Naidu
http://www.teluguone.com/news/content/bonda-umamaheswara-rao-25-227191.html





