అమరరాజా గ్రూప్ కు లోకేష్ ఆహ్వానం.. ఏపీ క్షమాపణ చెప్పాలంటూ ఎమోషనల్ ట్వీట్.!
Publish Date:Jul 16, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలోనే కాకుండా, ఉభయ తెలుగు రాష్ట్రాల వ్యాపార వర్గాల్లో ఇప్పుడో భావోద్వేగ చర్చ మొదలైంది. చిత్తూరు జిల్లా నేల నుంచి పుట్టి, దేశవ్యాప్తంగా తన బ్రాండ్ ఇమేజ్ను చాటిన ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం అమరరాజా గ్రూప్, పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో తన అడుగులు బలంగా వేసింది. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద దాదాపు 9 వేల 500 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక గిగా కారిడార్లో భాగంగా, తొలి కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ను అమరరాజా యాజమాన్యం ప్రారంభించింది. ఈ ప్లాంట్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరరాజా అధినేత గల్లా జయదేవ్ సామాజిక మాధ్యమాల వేదికగా తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ పెట్టిన ఒక పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే.. జయదేవ్ గల్లా సోషల్ మీడియాలో చేసిన ఈ ట్వీట్పై ఆంధ్రప్రదేశ్ ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆ సందర్భంగా లోకేష్ చేసిన ఎమోషనల్ కామెంట్స్ రెండు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. గల్లా జయదేవ్ ట్వీట్కు స్పందిస్తూ నారా లోకేష్.. ఏపీ మీకు క్షమాపణ చెప్పాలి గల్లా జయదేవ్ గారు అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టు ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. గత నాలుగు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ సాధించిన అతిపెద్ద పారిశ్రామిక విజయగాథలలో అమరరాజా కేవలం ఒక వ్యాపార సంస్థ మాత్రమే కాకుండా.. ఈ రాష్ట్ర ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్న లోకేష్.. స్థానికంగా వేలాది మంది యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా, చిత్తూరు జిల్లా పేరును ప్రపంచ చిత్రపటంలో సగర్వంగా నిలబెట్టిన ఘనత అమరరాజా సంస్థదేనన్నారు. అయితే జగన్ ప్రభుత్వ హయాంలో ఈ సంస్థ ఎదుర్కొన్న రాజకీయ వేధింపులు, ఆటంకాలు ఉండాల్సింది కాదనీ, సొంత గడ్డపై పెట్టుబడులు పెట్టి, ఇక్కడి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని భావించిన ఒక పారిశ్రామికవేత్తకు లభించాల్సింది ప్రోత్సాహం, గౌరవం మాత్రమేనన్న.. లోకేష్, జగన్ హయాంలో అమరరాజా సంస్థకు, యాజమాన్యానికి దక్కినవి బెద రింపులు, వేధింపులేనని పేర్కొన్నారు. లోకేష్ కామెంట్స్ తో జగన్ హయాంలో.. అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది. జగన్ హయాంలో అమరరాజా ఎదుర్కొన్న వేధింపులు ఒక ఆంధ్రుడిగా తనను కలచివేశాయన్న లోకేష్ వ్యాఖ్యలతో పారిశ్రామిక వర్గం ఏకీభవిస్తున్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పూర్వవైభవాన్ని తీసుకొస్తున్నదని లోకేష్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అమరరాజా ప్రస్థానం ఎక్కడైతే మొదలైందో, అదే ఆంధ్రప్రదేశ్ గడ్డపై రాబోయే రోజుల్లో ఆ సంస్థ కొత్త అధ్యాయాలు సృష్టిస్తుందని విశ్వసిస్తున్నానని పేర్కొన్న లోకేష్.. మా హృదయాలు, ఏపీ తలుపులు అమరరాజా కోసం ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని పేర్కొంటూ.. నారా లోకేష్ గల్లా జయదేవ్ను ఏపీకి హ్వానించారు. లోకేష్ ఈ ట్వీట్ ద్వారా.. రాజకీయాల వల్ల పారిశ్రామిక రంగం నష్టపోకూడదనే సందేశాన్నిచ్చారని పరిశ్రమవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. Amara Raja Batteries, Nara Lokesh Tweet, Galla Jayadev, Telangana Gigafactory, AP Investment Shift, Nara Lokesh Apology to Galla Jayadev
http://www.teluguone.com/news/content/amara-raja-batteries-39-226204.html





