ఇన్ఫార్మర్లుగా మారిన సాక్షి విలేఖరులు
posted on Sep 9, 2012 11:37AM

రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి విలేఖరులు జగన్ పార్టీకి ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకలాపాలు, నాయకుల పని తీరుపై వీరు డైలీ రిపోర్టులు హైదరాబాద్లోని సాక్షి దిన పత్రిక ప్రధాన కార్యాలయానికి పంపుతున్నారు. డైలీ రిపోర్టుల తయారీలో ఆయా ఎడిషన్ కేంద్రాల్లో పనిచేసే బ్యూరో ఇన్చార్జ్ లు, జిల్లా కేంద్రాల్లోని స్టాఫ్ రిపోర్టర్లు కీలకపాత్ర వహిస్తున్నారు. వీరు ఆయా జిల్లాల్లోని నాయకుల పనితీరును , పార్టీ పరిస్ధితిని ఎప్పటి కప్పుడు రిపోర్ట్ చేస్తున్నారు. వీరి రిపోర్టులకు పార్టీ నాయకత్వం ప్రాధాన్యత ఇస్తుండడంతో బ్యూరో ఇన్చార్జ్ లకి, స్టాఫ్ రిపోర్టర్లకి ప్రాధాన్యత పెరిగింది. వీరిని ప్రసన్నం చేసుకోవడానికి జగన్ పార్టీ నాయకులు తంటాలు పడుతున్నారు. ధర్నాలు, సమావేశాలు నిర్వహించినప్పుడు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారని , అవి విజయవంతం అయ్యాయని రిపోర్టు పంపాల్సిందిగా ఛోటామోటా నాయకులు కూడా సాక్షి ప్రతినిధులను కోరుతున్నారు.

కొన్ని జిల్లాల్లో సాక్షి ప్రతినిధులను ప్రసన్నం చేసుకోవడానికి నేతలు పోటీలు పడుతున్నారు. తమకు అనుకూలమైన రిపోర్టుల కోసం సాక్షి ప్రతినిధుల్ని ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారుకూడా.. మరి కొన్ని చోట్ల తమకు అనుకూలంగా రిపోర్టులు ఇవ్వడం లేదనో , ఉద్దేశ్య పూర్వకంగా తమ వార్తలు ప్రచురించడం లేదనే సాకుతో సాక్షి విలేఖరులపై జగన్ పార్టీ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తున్నారు. సాక్షి పత్రికలో తమ వార్తలు రావడానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తోందని కొందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో నలుగురు ముఖ్యనాయకులు ఉంటే వారందరి వార్తలు ఎలా ప్రముఖంగా ఇవ్వగలమని సాక్షి ప్రతినిధులు అంటున్నారు. ఒక నేత వార్త జిల్లా ఎడిషన్ మెయిన్ పేజిలో ఇస్తే మిగిలిన వారి వార్తలు లోపలి పేజీల్లో ఇవ్వాల్సి వస్తుందని , కాని అందరు నాయకులు తమ వార్త మెయిన్ పేజీలోనే రావాలని పట్టుబడుతున్నారని సాక్షి ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.