కేసీఆర్‌ నల్లత్రాచు

 

కొడంగల్‌ నియోజకవర్గం బోమరాస్‌పేట్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్‌షోలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెరాస ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. కేసీఆర్‌ నల్లత్రాచు లాంటి వారని, నల్లత్రాచును తొక్కి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. వికారాబాద్‌ జిల్లాకు తెరాస ప్రభుత్వం ఎందుకు డబుల్‌ రోడ్డు ఇవ్వలేదని ప్రశ్నించారు. బోమరాస్‌పేట పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా చేయాలని కోరితే ఎందుకు చేయలేదని నిలదీశారు. తనను ఓడించాలని తెరాస నేతలు అంటున్నారని, నియోజకవర్గంలో అభివృద్ధి చేసినందుకు నన్ను ఓడించాలా? అని ప్రశ్నించారు. తొమ్మిదేళ్ల క్రితం కొడంగల్‌ ప్రజలు నాటిన మొక్కను తానని, ఇక్కడి ప్రజల ఆశీర్వాదం వల్లే ఈ నియోజకవర్గం అందరికీ తెలిసిందన్నారు. గల్లీలో ఉన్న రేవంత్‌రెడ్డిని ఢిల్లీలో ఉన్న రాహుల్‌ గాంధీ గుర్తించారని చెప్పారు. 

కూటమే అధికారంలోకి వస్తుందని తన సర్వేలో తేలినట్లు లగడపాటి చెప్పారని, పది రోజుల్లో మన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. రైతులు ఎవరూ బ్యాంకులకు రుణాలు చెల్లించొద్దని, తాకట్టులో ఉన్న పాసు పుస్తకాలన్నీ రైతుల ఇళ్లకు తానే తీసుకొచ్చి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.5లక్షలు ఉచితంగా అందిస్తామని, 58 ఏళ్లు నిండిన పేదలందరికీ పింఛన్‌ ఇస్తామని, పేదలకు రేషన్‌లో సన్నబియ్యం, ఇంటికి ఆరు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ 48 గంటలు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రేవంత్‌ సూచించారు. ఊర్లోకి కొత్తవాళ్లెవరైనా వస్తే పట్టుకోండని పిలుపునిచ్చారు.