ముద్రగడ బేటీ... పవన్‌ కళ్యాణ్‌తో భేటీ!

కాపులందరికీ తానే ప్రతినిధినని చెప్పుకునే ముద్రగడ పద్మనాభాన్ని ఆయన కుమార్తె క్రాంతి తీసి అవతల పారేసిన విషయం తెలిసిందే. తన తండ్రి పవన్ కళ్యాణ్‌ని అన్యాయంగా విమర్శిస్తున్నారని, తన మద్దతు పవన్ కళ్యాణ్‌కేనని ప్రకటించి క్రాంతి సంచలనం సృష్టించారు. దీంతో ముద్రగడ షాక్‌కి గురయ్యారు.

ఇదిలా వుంటే ముద్రగడ కుమార్తె క్రాంతి ఆదివారం నాడు పవన్‌కళ్యాణ్‌తో తునిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా క్రాంతి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ‘‘ముద్రగడ కుమార్తె క్రాంతి జనసేన పార్టీ మీద నమ్మకంతో వచ్చారు. క్రాంతిని నా సోదరిలా గౌరవిస్తాను. అయితే, క్రాంతి జనసేన పార్టీలో చేరే అంశంపై నేను ముద్రగడతో మాట్లాడి, ఆయన అనుమతి తీసుకుంటాను. పెద్దవాళ్లు ఎన్ని మాటలైనా అంటారు. వాటిని సీరియస్‌గా తీసుకోకూడదు. నేను ముద్రగడను, ఆయన కుమార్తెను కలుపుతాను. ఈసారి ఎన్నికలలో ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతిని ఎమ్మెల్యేగా నిలబెట్టి గౌరవిస్తాను’’ అన్నారు.