పెమ్మసానికి ప్రజలు బ్రహ్మరథం.. మెజార్టీలో అగ్రస్థానం ఖాయం
posted on May 4, 2024 5:47PM
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ నేతల ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రం నలుమూలలా అభ్యర్థులు గెలుపుకోసం ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్తయితే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజకవర్గ ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ, మేధావి వర్గమూ ఎక్కువే. అలాంటి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు. విజయం ఎప్పుడో ఖాయం కాగా.. ఇప్పుడు పెమ్మసాని మెజారిటీపైనే రాష్ట్రం వ్యాప్తంగా చర్చ జరుగుతోంది బుర్రిపాలెం బుల్లోడుగా ప్రజల మనసుల్లో ముద్ర వేసుకున్న పెమ్మసాని.. తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్తూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా కిలారు రోశయ్య బరిలో ఉన్నప్పటికీ.. పెమ్మసాని దూకుడుకు ఫ్యాన్ ఫ్యాన్స్ సైతం ఫిదా అవుతున్నారు.
విద్యాభ్యాసంలోనూ, సేవా కార్యక్రమాల్లోనూ, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలోనూ, నీతివంతమైన పాలన అందించే విషయంలో.. ఇలా ఏ అంశంలో తీసుకున్నా వైసీపీ అభ్యర్థికి అందనంత ఎత్తులో పెమ్మసాని ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. అమెరికాలో వైద్య విద్య అధ్యాపకుడిగా, ఫిజిషియన్గా సేవలందించిన పెమ్మసాని.. వ్యాపార రంగంలోనూ అగ్రస్థానాలకు చేరుకున్నారు. అమెరికాలో ఉన్నప్పటికీ తన సొంత ప్రాంతానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో పెమ్మసాని ట్రస్టు ఏర్పాటు చేసి.. పేద ప్రజలకు అండగా నిలుస్తూ వస్తున్నారు. ముక్కుసూటి తనం.. ఎలాంటి సమస్యనైనా ఓపిగ్గా పరిష్కరించే తత్వం.. ప్రజలకు నిత్యం అండగా నిలిచే స్వభావం.. ఇలా అన్నివిధాల పెమ్మసానే మాకు సరైన నేత అంటూ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు.
పెమ్మసాని చంద్రశేఖర్ , కిలారు రోశయ్యలను పలు అంశాల్లో పోల్చి చూస్తున్న జనం అన్ని విధాల పెమ్మసానే బెటర్ ఛాయిస్.. కాదు కాదు బెస్ట్ చాయిస్ అంటూ ముక్తకంఠంతో చెబుతున్నారు.
విద్యార్హతల విషయంలో..
కూటమి మద్దతుతో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ బరిలో నిలిచిన తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వైద్యునిగా అత్యున్నత స్థానం సాధించారు. 1976 మార్చి 7న గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలెంలో జన్మించిన పెమ్మసాని.. డాక్టర్ కావాలనే కలతో 1993-94లో ఎంబీబీఎస్ ఎంట్రన్స్లో 27వ ర్యాంకు సాధించి హైదరాబాద్ ఉస్మానియాలో మెడిసిన్ పూర్తి చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం 2000 సంవత్సరంలో అమెరికాకు వెళ్లిన ఆయన.. పీజీ పూర్తి చేసి అక్కడే ప్రపంచవ్యాప్తంగా పేరున్న జాన్ యూనివర్సిటీలో ఐదేళ్లపాటు టీచింగ్ ఫ్యాకల్టీగా కొనసాగారు. ఈ రంగంలో అనేక మంది వైద్య విద్యార్థులకు మెటీరియల్ అందిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు. వ్యాపార రంగంలోనూ రాణించి అమెరికాలో ఒక ఎంటర్ పెన్యూయర్గా ఎదిగారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్య విద్యాభ్యాసం చూస్తే డిగ్రీ బీకాం చదివారు. యువతకు విద్యాపరంగా ఆయన ఎలాంటి సహాయక సహకారాలు అందించిన దాఖలాలు లేవు.
సేవా కార్యక్రమాల్లో..
పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికాలోనూ, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలోనూ అనేక సేవా కార్యక్రమాలు చేశారు. పెమ్మసాని ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలు అందించడంతోపాటు.. వైద్య బీమా లేక ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయులకు అండగా నిలిచారు. వ్యాపార రంగంలోనూ రాణించిన ఆయన తన పుట్టిన గడ్డకోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్వదేశానికి వచ్చారు. పల్నాడు ప్రాంత వాసుల ప్రధాన సమస్యగా ఉన్న నీటి కొరతను తీర్చేశారు. ఈ క్రమంలో వందల సంఖ్యలో బోర్వెల్స్, ఆర్వోప్లాంట్స్ ఏర్పాటు చేశారు. అంతేకాదు.. గ్రామీణ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను అందించేలా బెస్ట్ బెరీ స్కూల్ ను ప్రారంభించారు. దీనికితోడు పెమ్మసాని ట్రస్టు ఏర్పాటు చేసి పేద ప్రజలకు, స్వచ్చంద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు.
ఇక వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య విషయానికి వస్తే ఆయన ఇప్పటి వరకు విద్యా పరంగా చేసిన సేవలు లేవు. వ్యాపార రంగంలో ఉన్నప్పటికీ యువతకు ఉపాధి, విద్యావకాశాలు కల్పించిన దాఖలాలు లేవు. ఐదేళ్ల కాలంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న పొన్నూరు నియోజకవర్గంలో ఎక్కడా నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదు.
రాజకీయ రంగంలో..
పెమ్మసాని చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. పెమ్మసానికి చంద్రబాబు అంటే చాలా ఇష్టం. చంద్రబాబు సీఎం హోదాలో అమెరికాలో పర్యటించిన వేళ అక్కడ ఏర్పాటు చేసిన సమావేశాలకు పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. ఆ సమయంలోనే చంద్రబాబుతో ముఖాముఖి పరిచయం ఏర్పడింది. అలా రాజకీయాలపై మరింత ఆసక్తి పెంచుకొని తెలుగుదేశం బలోపేతానికి చంద్రబాబుతో కలిసి పని చేయడం ప్రారంభించారు. 2014లోనే తెలుగుదేశం నుంచి నర్సరావుపేట లోక్సభ టిక్కెట్ కోసం ప్రయత్నించారు. కానీ, 2014, 2019లో అవకాశం దక్కలేదు. గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు విరామం తీసుకోవడంతో చంద్రబాబు మరో ఆలోచన లేకుండా ఆ స్థానంలో పెమ్మసానికి టికెట్ ఇచ్చారు. దీంతో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పెమ్మసాని తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు.
కిలారు రోశయ్య విషయానికి వస్తే.. పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న కిలారి రోశయ్యకు ఆ స్థానంలోనే మరోసారి టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం నిరాకరించింది. గుంటూరు ఎంపీ అభ్యర్థులుగా వైసీపీ అధిష్టానం ఇద్దరిని బరిలోకి దింపినా వారు పెమ్మసానికి సరితూగలేమని చేతులెత్తేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మరో గత్యంతరం లేక సీఎం జగన్ గుంటూరు పార్లమెంట్ బరిలో రోశయ్యను బరిలోకి దింపారు.
ప్రజా సమస్యలపై ఎవరి అవగాహనలో ..
పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయాల్లో అడుగు పెట్టినప్పటి నుంచీ గుంటూరు నియోజకవర్గ పరిధిలో ప్రతి గడపకూ వెళుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, లాయర్లు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపార వేత్తలు, టీచర్లు, కార్మిక, కర్షక సంఘాల నాయకులతో సమావేశమవుతున్నారు. ఆప్యాయంగా పలకరిస్తూ నేనున్నాననే భరోసా ఇస్తున్నారు. పేద వర్గాల ప్రజల జీవన ప్రమాణాలను తెలుసుకుంటూ.. వారికి ఆర్థికాభివృద్ధికి తగిన ప్రణాళికలు రచించారు. పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి సమస్యపైనా చర్చిస్తూ పరిష్కార మార్గాలు చెబుతూ పెమ్మసాని గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజల మన్ననలు పొందుతున్నారు. అంతేకాదు.. అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ శెభాష్ పెమ్మసాని అనిపించుకుంటున్నారు.
వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య గుంటూరు ప్రాంతంలో జన్మించారు. పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన ప్రజల వద్దకు పెద్దగా వెళ్లింది లేదు. నియోజకవర్గంలో ఎన్ని గడపలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. ప్రజా సమస్యల గురించి అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు. రోశయ్యదీ రాజకీయ నేపథ్య కుటుంబమే అయినా.. ఆయన తన రాజకీయ జీవితంలోనూ సొంత నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేవు. తన సామర్థ్యంతో రాజకీయంగా ఎదగలేదు. ఐదేళ్ల కాలంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న పొన్నూరు నియోజకవర్గంలో ఎక్కడా ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించిన పాపాన పోలేదు.
ఏపీ రాజధాని విషయంలో..
పెమ్మసాని చంద్రశేఖర్ రాజధాని అమరావతిని అణువణువూ అధ్యయనం చేశారు. రాజధాని ప్రాంతంలో ఐదేళ్ల కాలంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు వివరిస్తూ.. కూటమి అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని, ప్రపంచ పటంలో రాజధాని అమరావతిని నిలిపేందుకు పక్కా ప్రణాళికతో కృషి చేస్తామని గుంటూరు పార్లమెంట్ ప్రజలకు హామీ ఇచ్చారు.
వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య తన ఎన్నికల ప్రచారంలో అమరావతి నిర్మాణం గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఐదేళ్లలో అమరావతిని సీఎం జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తుంటే ఎమ్మెల్యేగా ఉండి అడ్డుచెప్పలేక పోయారు. అమరావతి మహిళలను ప్రభుత్వం వేధిస్తుంటే అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పటి వరకు అమరావతి ప్రాంతంలో అడుగు కూడా పెట్టలేదు. మూడు రాజధానులు అంటున్న జగన్ మోహన్ రెడ్డి అడుగులకు మడుగులొ త్తడం తప్పితే.. అమరావతి రాజధాని గురించి రోశయ్య పట్టించుకున్నదే లేదు.
యువతకు ఆదర్శం..
పెమ్మసాని చంద్రశేఖర్ వైద్య వృత్తిలో, వ్యాపార రంగంలో రాణించి ప్రపంచమే తన వైపు తిరిగి చూసేలా విజయాలు అందుకున్నారు. పేద ప్రజలకు ,కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తూ తన ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ నేటి యువతకు మార్గదర్శకంగా నిలిచారు. అంతేకాదు.. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు.
వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య తన వ్యాపారాల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డార ఆరోపణలు మెండుగా ఉన్నాయి. పదవిని అడ్డు పెట్టుకుని ప్రజా సందపను దోచుకున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏ ఒక్క విషయంలోనూ రోశయ్య యువతకు ఆదర్శంగా నిలిచేలా పనులు చేయలేదు.
అనేక అంశాల్లో పెమ్మసాని చంద్రశఖర్, కిలారి రోశయ్యను గమనిస్తున్న గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు పెమ్మసానికి జై కొడుతున్నారు. భారీ మెజార్టీతో పెమ్మసానికి పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ సర్వేలన్నీ పెమ్మసాని మెజార్టీపైనే చర్చ చేస్తున్నాయి. దీంతో, రాష్ట్ర రాజకీయాల్లో పెమ్మసానికే అత్యధిక మెజార్టీ అవడం ఖాయమని విశ్లేషకులు గట్టిగా చెబుతున్నారు.