'జగన్ పై దాడి' కేసు.. ఏపీ సర్కార్‌పై హైకోర్టు సీరియస్

 

వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో ఏపీ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే రాష్ట్ర పోలీసులు ఎందుకు విచారణ చేపట్టారని?.. కేసు విచారణను ఎన్‌ఐఏకు ఎందుకు బదిలీ చేయలేదో వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై ఈరోజు మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది. సెక్షన్ 3 ఈ కేసులో వర్తించదని.. వ్యక్తిగత దాడిగా దీన్ని పరిగణించి రాష్ట్ర ప్రభుత్వమే దర్యాప్తు చేపడుతుందని ఏపీ సర్కార్ తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. అయితే ఆయన వాదనతో ఏకీభవించని హైకోర్టు.. కేసును కేంద్రానికి పంపకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 14లోపు ఎన్ఐఏకు కేసును ఇవ్వాలా లేదా అన్న దానిపై నిర్ణయం తీసుకోమని కేంద్రానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.