కొత్త మద్యం విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కొత్త మద్యం విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. మద్యం కనీస ధర 99 రూపాయల నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. 

అలాగే భోగాపురం విమానాశ్రయానికి ‘‘అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం’’గా పేరు పెడుతూ మంత్రివర్గం తీర్మానించింది. వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణ అంశం మీద  కేబినేట్ సమావేశంలో చర్చించారు. గత సంవత్సరం ఆగస్టులోనే వాలంటీర్ల కాలపరిమితి ముగిసిందని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. ఏడాది క్రితమే వాలంటీర్లను జగన్ తొలగించారని.. 2023లో వాలంటీర్ల పదవీకాలం ముగిసినా రెన్యువల్ చేయలేదని మంత్రులు పేర్కొన్నారు. 

తప్పుడు విధానాలు.. దొంగ పద్ధతుల్లోనే జగన్ తన పరిపాలన సాగించారని పలువురు మంత్రులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వాలంటీర్ల పునరుద్ధరణ అంశంలో మరింత సమాచారం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సూచించారు. జగన్ ప్రభుత్వ హయాంలో సాక్షి పత్రిక కొనుగోళ్ల పేరిట జరిగిన అవకతవకలపై కేబినెట్లో చర్చించారు. సాక్షి పత్రిక కొనుగోళ్ల కోసం రెండు సంవత్సరాలలో ప్రభుత్వ ఖజానా నుంచి 205 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని మంత్రులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సాక్షికి జరిపిన చెల్లింపులపై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వాలంటీర్లు, సచివాలయాలకు దిన పత్రికల కొనుగోలుకు నెలనెలా ఇచ్చే 200 రూపాయలను రద్దు చేశారు.

అలాగే పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సీడబ్ల్యూసీ సూచనల మేరకు పాత ఏజన్సీకే ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఒకే ఏజెన్సీకే పనులు కేటాయించడం వల్ల భవిష్యత్తులో ఏవైనా సమస్యలు తలెత్తినా ఏజెన్సీ బాధ్యత ఉంటుందని మంత్రివర్గం అభిప్రాయపడింది. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ 'స్టెమీ' పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.  ఆధార్ తరహాలో విద్యార్థులకు 'అపార్' గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. హోంశాఖలో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నారు.  కొత్త కార్పొరేషన్‌కి 10 కోట్ల కార్పస్ ఫండ్ కేటాయించారు.