ఒమిక్రాన్ కు ఆనందయ్య బూస్టర్ డోస్! 

కరోనాకు మందు తయారు చేసి సంచలనం రేకెత్తించిన ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య ఇప్పుడు ఒమిక్రాన్ కు మందును తయారు చేశారు. ఈ మందు పంపిణీని కూడా ప్రారంభించారు.ఒమిక్రాన్ సోకకుండా ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ మాదిరి ఈ మందును వేసుకోవాల్సి ఉంటుందని ఆనందయ్య తెలిపారు. సుమారు 22 రకాల దినుసులతో ఐదు రకాల మందులు తయారు చేసినట్టు చెప్పారు. ఈ మందును ఒకే రోజు రెండు పూటలా తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. తన మందుల తయారీకి కోర్టుల అనుమతి కూడా ఉందని చెప్పారు.

ఒమిక్రాన్ సోకిన వారు మందు కోసం తనను సంప్రదించవచ్చని ఆనందయ్య తెలిపారు. ప్రస్తుతం ఈ మందును బంధువులు, మిత్రుల ద్వారా ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న యూకే, యూఎస్ఏ తదితర దేశాలకు ఎక్కువగా పంపిస్తున్నామని చెప్పారు. ఈ మందును ఏడాది పాటు నిల్వ ఉంచుకోవచ్చని తెలిపారు. మందు తీసుకునే వారు 15 రోజుల పాటు మాంసాహారం, మద్యం తీసుకోకూడదని చెప్పారు.

అయితే ఆనందయ్య మందుపై ఆయుష్ శాఖ వాదన మాత్రం మరోలా ఉంది. కరోనాకు, ఒమిక్రాన్‌ వేరియంట్‌కు మందు ఇస్తామని తమనెవరూ సంప్రదించలేదని ప్రకటించింది. అలాంటి గుర్తింపులేని వ్యక్తులు అందించే మందులను ఆయుర్వేద మెడిసిన్‌గా భావించొద్దని ఆయుష్‌ శాఖ స్పష్టంచేసింది. ఒమిక్రాన్‌కు ఆయుర్వేద మందు ఇస్తామని కొందరు చెపుతున్న నేపథ్యంలో ఏపీ ఆయుష్ శాఖ క్లారిటీ ఇచ్చింది. ఒమిక్రాన్‌ కోసం ప్రభుత్వం ఆయుర్వేద మందుకు అనుమతివ్వలేదని స్పష్టం చేసింది. 

ఎవరైనా గుర్తింపు లేని వ్యక్తుల ద్వారా అందించే మందును ఆయుర్వేద మందుగా భావించి నష్టపోవద్దని ఈ సమాచారం తెలియచేస్తున్నట్లు ఏపీ ఆయుష్ శాఖ తెలిపింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన Ayush-64, Arsenic Album 30C లాంటి హోమియో మందులను వైద్యుల సలహా మేరకు తీసుకోవడం మంచిందంటున్నారు. వాక్సిన్‌ తీసుకోవడం, మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించాలని సూచించారు.