అమెరికాలో మోడీ హిందీ ప్రసంగం

 

భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన ఖరారు అయింది. ఒకప్పుడు మోడీకి వీసా ఇవ్వడానికే నిరాకరించిన అమెరికా ఇప్పుడు మోడీ ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తోంది. మోడీకి ఘనస్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 26 నుంచి 30 వరకు మోడీ అమెరికా పర్యటన ఖరారు అయింది. ఈనెల 29 లేదా 30వ తేదీన మోడీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అవుతారు. 27న జరిగే ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. ఈ సభలో మోడీ హిందీలో ప్రసంగించనున్నారు. ఎప్పటి నుంచో భారత్ ఆశిస్తున్న భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం గురించి మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు. ట్విన్ టవర్స్‌ కూల్చివేతలో మరణించిన వారికి కూడా మోడీ ఈ పర్యటనలో శ్రద్ధాంజలి ఘటించనున్నారు. అమెరికాలోని ఆరు ప్రధాన కంపెనీల సీఇఓలతో కూడా నరేంద్రమోడీ సమావేశమవుతారు.