రేవంత్ సర్కారుపై హైకోర్టు సీరియస్ 

కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య మాటల యుద్దం కాస్తా హైకోర్టు వరకు తీసుకెళ్లింది. 
క‌ల్యాణ‌ల‌క్ష్మి చెక్కుల పంపిణీలో జాప్యం ఎందుకు జ‌రుగుతోందో వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్ర‌యించారు. 
మంత్రి ఆదేశాలతో అధికారులు చెక్కులు పంపిణీ చేయ‌కుండా ఆపుతున్నారని కోర్టు ముందు విన్నవించారు. ఈ నెల 27 వరకు చెక్కులు పంపిణీ చేయ‌కుంటే బౌన్స్ అయ్యే ప్రమాదం ఉందని, త్వరగా పంచడానికి అనుమతులు ఇప్పించాలని కౌశిక్ రెడ్డి న్యాయ‌స్థానాన్ని కోరారు.     
కౌశిక్ రెడ్డి పిటిష‌న్‌పై బుధ‌వారం విచార‌ణ చేప‌ట్టిన అత్యున్న‌త న్యాయ‌స్థానం చెక్కులను పంపిణీ చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అధికారులను ప్రశ్నించింది. చెక్కుల పంపిణీలో ఎందుకు జాప్యం జ‌రుగుతోందో వివరణ ఇవ్వాలని అధికారులను కోర్టు ఆదేశించింది.