నాగ్పుర్ లో కర్ఫ్యూ ఎత్తివేత
posted on Mar 21, 2025 5:56PM

నాగపూర్ లొ మూడు రోజుల అనంతరం కర్ఫ్యూ ఎత్తివేశారు. నాగపూర్ లో ఇటీవల హింసాకాండకు చెలరేగడానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ద్వారా ఘర్షణలకు కారకుడయ్యారన్న ఆరోపణలపై ఫారీమ్ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మైనారిటీ డెమొక్రటిక్ పార్టీ నాగపూర్ అధ్యక్షుడైన ఫారీమ్ ఖాన్ తో పాటు ఆరుగురిపై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. వీరు కాకుండా మరో 50 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో శంభాజీనగర్లోని 18వ శతాబ్దానికి చెందిన ఆయన స్మారకానికి ఇరువైపులా భారత పురావస్తు శాఖ ఇనుప రేకులను, కంచెను ఏర్పాటు చేసింది. పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.
చావా సినిమా విడుదల తరువాత నాగపూర్ లో హింసాకాండ చెలరేగిన సంగతి విదితమే. ఆ సినిమాలో ఛత్రపతి శంభాజీ మహరాజ్ ను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దారుణంగా హత్య చేసినట్లుగా చూపడంతో జనం కోపోద్రిక్తులయ్యారు. ఆ సినిమా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టింది. ఔరంగజేబు సమాధిని తొలగించాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినిపించింది. ఈ నేపథ్యంలోనే హింస చెలరేగింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు.