గచ్చిబౌలి సభను మరచిపోలేను: చంద్రబాబు

జగన్ ప్రభుత్వం తనను అన్యాయంగా జైల్లో వేసినప్పుడు పార్టీలకు సంబంధం లేకుండా అనేకమంది నాకు సంఘీభావం పలికారు. ముఖ్యంగా గచ్చిబౌలిలో నిర్వహించిన సభను నేను మరచిపోలేను అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నాలుగోసారి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన అనంతరం, ఆదివారం నాడు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కి చంద్రబాబు మొదటిసారి వచ్చారు. కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం విజయానికి తెలంగాణ తెదేపా శ్రేణులు పరోక్షంగా కృషి చేశాయి. తెలంగాణ గడ్డ మీద తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వస్తుందన్న నమ్మకం నాకుంది.  ఏపీలో తెలుగుదేశం విజయానికి సహకరించిన ఆత్మీయులను కలిసి అభినందనలు తెలియజేయాలని వచ్చాను. మీ అభిమానం చూస్తుంటే నాకు ఉత్సాహం పెరుగుతూ వుంటుంది. తెలంగాణలో అధికారంలో లేకున్నా కార్యకర్తలు పార్టీని వదల్లేదు. పార్టీ నుంచి నాయకులు వెళ్ళారే తప్ప కార్యకర్తలు వెళ్ళలేదు. ఎన్టీఆర్ అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారు. సంక్షేమానికి నాంది పలికిన నాయకుడు ఆయన. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ జెండా తెలుగుజాతి ఉన్నంతవరకు రెపరెపలాడుతుంది. సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుని మళ్లీ అధికారంలోకి వచ్చాం. నన్ను జైల్లో పెట్టినపుడు తెలుగుదేశం శ్రేణులు చూపించిన చొరవ మరువలేను. నా అరెస్టుకు వ్యతిరేకంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో నిరసనలు చేపట్టారు. ఆ సమయంలో గచ్చిబౌలిలో నిర్వహించిన సభను నేను మరిచిపోలేను. హైదరాబాద్‌లో నాకు మద్దతుగా నిర్వహించిన ఆందోళనలను టీవీలో చూసి గర్వపడ్డా. 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంస ప్రభుత్వం వచ్చింది. విభజన కంటే జగన్ పాలనతో జరిగిన నష్టమే ఎక్కువ. యువగళం, నిజం గెలవాలి కార్యక్రమాలు ప్రాచుర్యం పొందాయి. ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి 70 రైళ్లలో ప్రజలు తరలివచ్చారు. రూ.లక్షలు ఖర్చు పెట్టుకుని ఎన్ఆర్‌ఐలు వచ్చారు. అందరూ ఓటు వేయడంతో ఏపీ ఎన్నికల్లో సునామీ వచ్చింది. గతంలో ఏపీలో ఉన్న భూతాన్ని చూసి కంపెనీలు రాలేదు. రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు కృషి చేస్తా’’ అని చంద్రబాబు అన్నారు.,

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం వుందని చంద్రబాబు చెబుతూ, ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాకు రెండు కళ్లు. నాలెడ్జి ఎకానమీకి తెలుగుదేశం హయాంలో నాంది పలికాం. నా తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ అభివృద్ధిని కొనసాగించాయి. విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్నాను. దాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఆయనకు మరోసారి కృతజ్ఞతలు. తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహం ఉండాల్సిన అవసరముంది. తెలుగు భాష, జాతి ప్రయోజనాలను పరిరక్షించుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభివృద్ధే తెలుగుదేశం ధ్యేయం. ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ఉంటే నష్టాలే ఎక్కువ. ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే సమస్యలు పరిష్కారమవుతాయి. తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వాలు ఉన్నాయి. సిద్ధాంతపరంగా ఆలోచనలు వేరుగా ఉన్నప్పటికీ తెలుగుజాతి ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తాం’’ అన్నారు.