‘చిరు’ద్యోగి బ్లడ్ స్కామ్ ని పట్టుకున్న బాలకృష్ణ ఫ్యాన్స్
posted on Sep 3, 2012 12:10PM
నెల్లూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 200 బ్లడ్ ప్యాకెట్లు పట్టుబడ్డాయి. ప్రభుత్వాసుపత్రినుంచి వీటిని తరలిస్తుండగా స్థానికులు నిందితుల్ని వెంబడించి పట్టుకున్నారు. ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి ప్రదీప్ కుమార్ తోపాటు మరో ఇద్దరు వ్యక్తులు బ్లడ్ ప్యాకెట్లను తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. నిందితుల్ని వెంటాడిపట్టుకున్నవాళ్లు సినీహీరో, టిడిపినేత బాలకృష్ణ ఫ్యాన్స్. బ్లడ్ బ్యాంక్ ల్ని అడ్డంపెట్టుకుని కొందరు అమాయకులైన నిరుపేదలనుంచి రక్తాన్ని సేకరించి అమ్ముకుంటున్న సంగతి ఈ ఘటనతో బైటపడిందని బాలకృష్ణ అభిమానులంటున్నారు. బ్లడ్ ప్యాకెట్లను తరలిస్తూ పట్టుబడ్డ ప్రభుత్వాసుపత్రి ఉద్యోగి ప్రదీప్ కుమార్, గతంలో గాంధీ ఆసుపత్రినుంచి కూడా సస్పెండయ్యాడని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేస్తున్న మరో ఉద్యోగి సాయంతో రక్తం సంచుల్ని తరలిస్తూ పట్టుబడ్డ నిందితుల్ని స్థానికులు చావచితక్కొట్టిమరీ పోలీసులకు అప్పగించారు. పట్టుబడ్డ రక్తం మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజునాడు ఆయన అభిమానులు దానంచేసిన రక్తమని అధికారులు చెబుతున్నారు.