Previous Page Next Page 
అపరాజిత పేజి 29

 

                                    19

    రాధ శరణాలయం నర్శింగ్ హోం లోనే పిల్లవాన్ని కన్నది. కాని ఆ వేల్టికి పది రోజులు. 'చిన్న చిన్నకాళ్ళు తన డొక్కల్లోకి సారిస్తూ, గుప్పిళ్ళు మూసిన చేతుల్ని తలకు రెండు వైపులా ఉంచుకుని పరమేశ్వరుని చిద్విలాసంలా నొసలు విరుస్తున్న ఈ పాప ఎంత అద్బుతమైన వరం! ఇటువంటి వరాన్ని ఈ దౌర్భాగ్యపు సంఘం ఈసడిస్తుంది? నీ కిక్కడ స్థానం లేదు పొమ్మని కసిగా వెంట తరిమి వేధిస్తుంది? ఈ అన్యాయాన్ని ప్రాణాల్తో ప్రతిఘటించడమే తన జీవితాదర్శం' - అనుకుంది రాధ. తాను హైదరాబాదు వచ్చి ఉద్యోగంలో కుదురుకున్న నాటినుండీ ఎదుర్కొంటున్న ఒడుదుడుకులు తనకు జ్ఞాపకం లేక పోలేదు. ఇక ముందు మరీ పెద్ద పెద్ద అలజడుల్ని ఎదుర్కోవలసి వస్తుందేమో కూడా! అయినా తనకేం భయం? కడుపులో చల్ల కదలకుండా జీవించాలనీ, అన్ని సుఖాలూ, అమర్చిన విస్తరిలా సమకూరాలనీ కోరుకునే వారికే యీ భయాలు. నిత్య సంఘర్షణను కావాలని ఆహ్వానించే తనలాంటి వాళ్ళకు యే భయాలూ లేవు.
    ఇంతవరకూ మధు జాడ తెలియలేదు. అతను లేకపోయినా బ్రతకగలనన్న ధీమా అటుంచి, అతను లేకపోవడం వల్ల మానసికంగా ఎంత లోటును అనుభవిస్తోంది తను! నిత్య సాన్నిహిత్యం లేక పోయిం తర్వాత ప్రేమ, ప్రేమ అనుకుని ఆ ప్రేమలో వుండే మాధుర్యాన్ని తానేం బావుకున్నట్లు? ఇటువంటి ఆలోచనలు చెలరేగినపుడే తన మనస్సు తీరని అసంతృప్తితో మండిపోయేది. ఉపశాంతికోసంగా తన కథనే నవలగా మార్చి, రాధలోని రచయిత్రి బయటి ప్రపంచానికి అందించే ప్రయత్నం చేసింది. ప్రతి వారం పాఠకుల లేఖలు ఆసక్తితో చదివేది. పాఠకులు నవల లోని తన పాత్రమీద అంతు లేని సానుభూతిని కుమ్మరించడం తనకు తృప్తి కలిగిస్తుండేది! కాని యిక్కడ? నిజ జీవితంలోని చుట్టూ వున్న మనుష్యులకు తనమీద కించిత్తుకూడా సానుభూతి లేదని తనకు తెలుసు. మధు తన్ను స్వీకరిస్తే తప్ప, ఎదుటివారి దృష్టిలో తన స్థితి బాగు పడదు. కాని అతను జీవితంలో తనకు తోడు నడుస్తాడన్న దుర్బ్రమ లేవీ తాను పెట్టుకోదలచుకో లేదు. ముందే నిర్ణయించుకున్నట్లు ఎవరి బ్రతుకులు వారివే.
    కాని ఒక్క విషయం శూలంలా తన గుండెల్లో మెరవడం రాధ గుర్తించక పోలేదు. తన్ను నవమాసాలు మోసి కని పెంచిన తల్లి దగ్గర అబద్ధపు బ్రతుకు బ్రతుకుతోంది. కాళ్ళూ చేతులూ పడి పోయి మంచానికంటుకుపోయిన తండ్రిని చూడడానికైనా తాను ముందంజ వేయలేకపోయింది. తాను, ఏ సంఘాన్ని ధైర్యంగా ఎదుర్కొని దాని వ్యవస్థను తారుమారు చెయ్యాలనుకుందో, చివరకు ఆ సంఘానికే బెదిరిపోతున్నట్లు ప్రవర్తించడం రాధకు నచ్చలేదు. అందుకు ఒక విధంగా మాధవీ, సత్యవతమ్మగారూ కారకులేమో కూడా! 'మాధవిని అమ్మకు చెప్పమని చెప్పేస్తాను. కొంచెం ఒంట్లో సుళువు చిక్కాక నా బిడ్డతో పుట్టింటికి వెళ్ళి, ఇన్నాళ్ళుగా దాచిన ఈ రహస్యాన్నీ విప్పేస్తాను.' అనుకుంది. తనకు నెల రోజులు సెలవు మంజూరయింది. సత్యవతమ్మగారితో చెప్పి తొందరలో అమ్మను చూడడానికి వెళ్ళాలన్న నిశ్చయం ఆమెకు శాంతి నిచ్చింది.
    సాయంత్రం, ఇంటికి సత్యవతమ్మగారే వచ్చారు. 'ఏమ్మా! ఎలా ఉంది ఒంట్లో! మీ మాధవి దగ్గర్నుంచి ఉత్తరాలు వస్తున్నాయా?'

                           


    'వస్తున్నాయండీ! నాన్నగారికి బొత్తుగా బాగా లేదట! నేనింకా ఎక్స్ కర్షన్ ట్రిప్ లో ఉన్నావనీ, అందుకే చూడడానికి రాలేదనీ మా అమ్మకు చెప్తోందట మాధవి. నేనీ అబద్ధాన్ని ఎందుకు భరించాలండీ? పాపను తీసుకుని వెళ్దామను కుంటున్నాను-' అన్నది.
    'అలాగే వెళ్ళు! ఈ రహస్యం అయిన వాళ్ళకు తెలియకుండా చివరదాకా దాచడం సినిమాల్లో సాధ్యమవుతుంది కాని నిత్య జీవితంలో కాదు. కాని ఉద్రేక పడకుండా సమయోచితంగా మెసలమని నీకు నేను చెప్పక్కర్లేదను కుంటాను. నీ జీవితంలో ఉన్న అనిశ్చితత్వం పోయి నువ్వు సుఖపడాలన్నదే నా కోరిక' అన్నారావిడ.
    ఆవేళ రాత్రి మాధవికి ఉత్తరం వ్రాసింది రాధ-'స్నానం అయిం తర్వాత పాపతో బయలుదేరి వస్తున్నాను. అమ్మను ఎటువంటి ఆవేశమూ లేకుండా నన్ను స్వీకరించే విధంగా నీకు చేతయితే చెయ్యి-' అన్నదే అందులో సారాంశం.
    ఆ ఉత్తరం చదువుకుని మాధవి కెటూ పాలు పోలేదు. రోగిని చూడ్డానికని ఇంట్లో అడపా దడపా బంధువులు వచ్చి వెళ్తూనే ఉన్నారు. మళ్ళీ వస్తానని రాజారావు ఊరికి వెళ్ళాడు. అటు పెద్ద నాన్న స్థితితోటీ, ఇటు బంధువులను చూచుకునే శ్రమతోటీ అలసిపోతున్న పెద్దమ్మకు మళ్ళీ మానసిక శ్రమను ఎక్కడ కలిగించగలదు తను! అయినా తప్పదు ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. రాధ విషయం కొంత అనుమానంగానే ఉంది పెద్దమ్మకు.
    'ఎంత ఎక్స్ కర్షన్ అయితే మాత్రం స్కూలు వాళ్ళకుకూడా అడ్రసు తెలియకుండా ఎలా తిరుగుతారంటావ్ మాధవీ? బహుశా దానికే ఇక్కడికి రావడం ఇష్టం లేక మభ్యపెడుతున్నదే నా!' అని రెండు మూడుసార్లన్నది. ఏదైనా తనకు తప్పేదే ముంది? ఆవేళ భోజనాలయిం తర్వాత శివశాస్త్రికి మందూ అదీ యిచ్చి పెద్దమ్మ దగ్గరకు చేరింది. మెల్లగా ఆమాట ఈమాటా చెప్తూ రాధసంగతి బయట పెట్టింది. పరమేశ్వరి స్థాణువులా కథ చివరికంటా విన్నది. రాధ నొక్కమాట అన్లేదు. ఏడ్చి మొత్తుకుని గొడవ పెడ్తుందేమో అనుకున్న మాధవిభయాన్ని నిరాధారం చేసింది. కాని,
    'నేను ఈ చేతుల్తో పెంచిన పిల్లల్లోనే ఎంత వ్యత్యాసం చూడు మాధవీ!- రాధా ఇటువంటిపనే ఏదో చేస్తుందనే భయం నాకు లీలగా ఉండేది. అతి విలువైన చీరలు ఇంటికి తెస్తున్నప్పుడూ తండ్రికి అడపాదడపా డబ్బు సర్దుతున్నప్పుడూ ప్రతిసారీ స్నేహితురాళ్ళతో సినిమాకు వెళ్తున్నానంటూ ఇంటికి ఆలస్యంగా వస్తున్నప్పుడూ, ఇటువంటి భయంతో కదిలిపోయేదాన్ని. కాని నే నేదన్నా అంటే నామాట ఈయింట్లో చెల్లుతుందన్న నమ్మకం లేకుండానే జీవితం వెళ్ళమార్చినదాన్ని. నేనాపిల్లకేం చెప్పగలనని! ఏమైనా అది నా కడుపున చెడబుట్టింది మాధవీ!' అని మాత్రం అన్నది పరమేశ్వరి.
    'ఊరుకో పెద్దమ్మా! దాన్నంతలా శపించకు. మారుతున్న కాలాన్ని మనసులో పెట్టుకుని మారుతున్న స్త్రీ మనసును కూడా దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే రాధ చేసింది పెద్ద దోషమేమీ కాదని నువ్వే ఒప్పుకుంటావ్ పెద్దమ్మా! తను ప్రేమించిన వాడిని పొందడం కోసం మరో అడుగు సాహసంగా ముందుకు వేసింది రాధ. వేసిన అడుగుకు సిగ్గుపడకుండా, ఆ ధైర్యంతోటే మరీ ముందుకు సాగింది లోకం దృష్టిలో ఏమో కాని, దాని దృష్టిలో ఆ మధు దానికి భర్తే కదా! దాని సంతానానికి తండ్రే కదా! వివాహమనే తతంగం జరిగిన దానికీ, జరగని దానికీ ఫలితంలొ పెద్ద తేడా లేదు పెద్దమ్మా కేవలం దృష్టిలో తేడా మాత్రమే-తాతముత్తాతలు సంపాదించిన ఆస్తిపాస్తులుంటే దాని వారసత్వం విషయంలో పేచీలు రావచ్చునేమోగాని, లేక పోతే ఏముంది?'-
    'అందుకంటం లేదమ్మా నేను!-దాని స్వార్ధ ప్రవృత్తిని మనసులో పెట్టుకుని మాత్రమే అంటున్నాను. మరణశయ్య మీద నీ అక్కకిచ్చిన మాటకోసం ప్రేమించిన వాడు దూరమై పోతున్నా చూస్తూ ఊరుకున్న నీ మనస్సూ, నువ్వు ప్రేమించిన మనిషివి ఎలాగో ఒకలాగ తనవైపు తిప్పుకోవాలని పాకులాడిన దాని మనస్సూ తైపారు చేసుకోకుండా ఉండలేక పోతున్నాను. ఏమైనా స్వార్ధం బహు చెడ్డది. చిన్ననాటి నుంచీ రాధ స్వార్ధ గుణాన్నే ఎక్కువ చూపించేది. చివరకు అదే దాని జీవితాన్ని ఒక వింత మలుపు తిప్పి నలుగురి కంటే ప్రత్యేకంగా దూరంగా నిలబెట్టింది. అయినా అది జీవితంలో నెగ్గుకు వస్తుంది మాధవీ! ఎటొచ్చీ వోడిపోయింది నీవే!' - మిక్కిలి ఆర్ద్రంగా బాధగా ధ్వనిస్తున్న పరమేశ్వరి గొంతు మాధవి కళ్ళలో నీటి పొరలు కమ్మడానికి కారణమైంది. పరమేశ్వరి మాధవి దగ్గరగా పోదుపుకుని తలను చేత్తో నిమురుతూ.
    'నీ జీవితాన్ని పాషాణంగా మార్చడానికే నిన్నీ యింటికి తెచ్చినత్లున్నాను తల్లీ! నీ పెదతల్లి కుటుంబం కోసం నువ్వే త్యాగాలూ చెయ్యకుండా చూచుకోవలసిన బాధ్యత నాదే అయినా, దాన్ని నేను సరిగా నిర్వహించలేక పోయాను. కుటుంబ శ్రేయస్సనే ఈ బలిపీఠం మీద నీ నూరేళ్ళ బ్రతుకూ ఖండితమై పోయింది. ఇప్పుడిక ఏం చేస్తే నువ్వు సుఖపడతావో నాకు తెలియడం లేదు' అన్నది.
    అమృత మయమైన మాతృ హస్త స్పర్శ, ఆవిడ బాధామయ వాక్కు, మాధవిలో కళవెళ పడుతున్న దుఃఖ సముద్రాన్ని పొంగులెత్తించింది. గట్టిగా వెక్కుతూ పెదతల్లి రొమ్ముల మీద తల ఆనించి అలానే సొమ్మసిల్లినట్లు ఉండిపోయింది మాధవి-

                                 *    *    *

    తర్వాత నాలుగు రోజులకు తెల్లవారి మందు తాగించడానికి లేవబోతే శివశాస్త్రి లేవలేదు. ఎవరు పిలిచినా, ఎంత ప్రలోభ పెట్టినా, తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడాయన. అలా జరగక తప్పదని సంశయిస్తున్నదే అయినా, ఆ మరణం పరమేశ్వరి ని బాగా కదిల్చి వేసింది. తిడుతూనో, కసురుతూనో దాదాపు ఏభైఏళ్ళ నుండీ కలిసి బతుకుతున్న మనిషి ఇక ఎప్పుడూ కనపడడన్న కటిక సత్యం ఆవిడను మరింత కుంగ దీసింది. మరణవార్త విని, కూతుర్ని తీసుకుని రెక్కలు కట్టుకు వాలాడు రాజారావు. రాధ తన తండ్రిని బ్రతికుండగా చూడలేకపోయిన నేరానికి కుళ్ళి కుళ్ళి యేడ్చింది. పరమేశ్వరి నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయిందే తప్ప తానై ఏ విషయంలోనూ కలగజేసుకోలేదు. రాజా రావే ఇంటికి పెద్ద కొడుకు మల్లే ప్రవర్తించి జరగవలసిన కార్య భారాన్నంతటినీ భుజాల మీదికెత్తుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS