అందరికీ స్నానాలయ్యాయి. కళ్యాణి కూడా బాగా అలసిపోయింది. 'అందుకే మరీ దగ్గరి బంధువుల పెళ్ళి రాకూడదనేది, చాకిరీ చేసి చావాలి' అని ముఖానికి పట్టిన చెమటంతా తుడుచుకుంది.
రఘు కళ్యాణినే క్రీగంట చూడడం నేను గమనించాను. మిగిలిన ముగ్గురబ్బాయిలు కూడా కళ్యాణి స్నానం చేయించడంతో వేడెక్కిపోయినట్లు కనిపించారు. వాళ్ళ అవస్థను కనిపెట్టలేని అమాయకురాలేం కాదు ఆమె మధ్యాహ్నం భోజనాల తరువాత పడుకున్నాం. మూడుగంటల కంతా లేచాం.
"బంధువులు రావడం యెక్కువింది. పెళ్ళికూతురి బృందం ఓ బస్సులో ఏడుగంటల ప్రాంతాన వచ్చారు. విడిది ఇంట్లో దిగిన వాళ్ళకి టిఫిన్లూ, కాఫీలు మోసి, ఒడ్డించేటప్పటికి యెనిమిదైంది. తోడి పెళ్ళికొడుకుల్లాగా కూర్చున్న నలుగురూ మాకు సహాయపడ్డారు.
రాత్రి భోజనాలు అయ్యేటప్పటికి పదయింది. అన్నీ సర్ది కళ్యాణి కోసం చూస్తే కనబడలేదు. ఎక్కడికెళ్ళిందో తెలియడం లేదు. రెండు మూడు గంటలయినా నిద్రపోకపోతే ముహూర్తం అప్పుడు ఫ్రెష్ గా ఉండలేము. కానీ ఎక్కడికెళ్ళిందో ఏమో తెలియడం లేదు.
తనను వెతుకుతూ దొడ్లో కెళ్ళాను. బాత్రూమ్ దాటాక ఉన్నదంతా మైదానం. చివరలో ఎక్కడో ఆ గడ్డివామి వుంది. అనాలోచితంగానే అక్కడికి వెళ్ళాను.
గడ్డివాము దగ్గరికి వెళ్ళానో లేదో వెనుక నుంచి ఓ ఆకారం రావడం గమనించాను. మసక వెలుతురులో ఆమె కళ్యాణి అని గుర్తించాను. ఆమె వెనకే మరో ఆకారము నన్ను చూసి వెళ్ళిపోయింది.
"ఎవరతను" కళ్యాణి దగ్గరికి రాగానే అడిగాడు.
"తోడి పెళ్ళికొడుకుల్లో ఒకడు రఘు"
నేను అలా నిలబడిపోయాను.
"ఏమిటలా నిలబడిపోయావు ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్లు"
"నువ్వు ఇలా..." నా మాటల్ని యెలా పూర్తిచేయాలో తెలియక ఆగిపోయాను.
మరొకరైతే ఏదో తప్పు చేసినదాన్లా తలొంచుకునే వారేమోగాని, ఆమె కళ్యాణీ కదా అందుకే గలగలా నవ్వి, "ఏం చేయను చెప్పు, భర్త ఎక్కడో? వంటరిగా బతకడం యెంత శూన్యంగా వుంటుందో, ఏదో కావాలన్న కోరిక నోటిని ఎంతకాలం మూయగలం? మధ్యాహ్నం నలుగురు యువకులకి ఒళ్ళు పట్టి, సబ్బు రుద్ది స్నానం చేయించాక ఉప్పూ, కారం తిన్న ఈ శరీరము వూరుకుంటుందా? అప్పటికీ నేను పతివ్రతను కాబట్టి ఒక్కడితో సరిపెట్టేసుకున్నాను" అంది.
అంతకు ముందు కలిగిన షాక్ కన్నా ఒక్కడ్నే పిలుపించుకున్న తను నూరుశాతం పతివ్రత అని ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ మరింత షాక్ కి గురిచేసింది.
తరువాత ఇద్దరం ఇంట్లోకి నడిచాం."
మహిత చెప్పడం ఆపింది. సూర్యాదేవి సన్నగా నవ్వుతోంది.
* * * * *
అప్పటికి టైమ్ సుమారు తొమ్మిది దాటింది. చీకటివాన ముసురులాగా చుట్టుకుంటోంది. రాత్రిని తాగి యింకాస్త బలిసినట్లు వీధి దీపాలు మరింత కాంతివంతంగా ప్రకాశిస్తున్నాయి. గాలి చక్కలిగింతలు పెట్టినట్లు చెట్లు మెల్లగా అటూ ఇటూ వూగుతున్నాయి.
"మీవారు ఇంకా రానట్లుంది" మహిత అడిగింది.
"ఈరోజు రావడం కాస్తంత ఆలస్యమౌతుందని ఫోన్ చేశారు. ఏవో ఎస్టిమేట్లు తయారు చేస్తున్నారట" అంది సూర్యాదేవి.
"ఈ మగవాళ్ళంతా ఇంతే తొందరగా ఇంటికి రారు. మీవారయినా డబ్బు సంపాదించే ప్రయత్నంలో ఆలస్యంగా ఇంటికి వస్తూంటే మా ఆయన లాంటివారు ఏ పని లేకపోయిన ఆ ఏ అర్ధరాత్రో ఇంటికి వస్తారు"
ఏ స్త్రీ అయినా తన భర్తమీద అసంతృప్తినే ప్రకటిస్తుంది. పురుషుడూ అంతే. ఇతర స్త్రీల మీద చూపించే సానుభూతి, జాలి, ప్రేమ తన స్వంత పెళ్ళాం మీద చూపించడు. ఇలా ఒకరిమీద ఒకరికి మంచి అభిప్రాయం లేకపోయినా కొన్ని ఏళ్లపాటు ఒకే ఇంట్లో గడిపేస్తారు. అందుకే ఈ పెళ్ళిళ్ళను కొంతకాలంపాటు నిషేధించాలి. నిషేధించాక ఆ తర్వాత ఈ సిస్టమ్ కు బదులు ఏ సిస్టమ్ ను ప్రవేశపెట్టాలో సూర్యాదేవికి తెలియలేదు. ప్రతిదాని తరువాత ఏమిటన్నది ఎప్పటికీ విడిపోని ప్రశ్న.
వసంత్ ప్రేమనంతా వ్యక్తం చేశాడు. ఆ తరువాత ఏం చేస్తాడంటే ఊహకందడం లేదు. మరొకరి భార్య అయిన తననుంచి ఏమాశిస్తున్నాడు అతను?
ఆ ప్రశ్నకు జవాబు లీలగా కదలడంతో ఎక్కడో భయంలాంటిది రెపరెపలాడింది. ఆమెకు ఆ ప్రహసనమంతా చాలా కొత్తగానూ, వింతగానూ వుంది.
పెళ్ళిపీటల మీద కూర్చున్న అమ్మాయిని ప్రేమించి, ఆమె పేరును కోటిసార్లు రాసి, "ఐ లవ్ యు" అని చెప్పి వెళ్ళిపోయిన అబ్బాయి గురించి ఆలోచించడమే తమాషాగా ఉంది.
ఆమెకు చిన్నతనం నుంచీ పబ్లిక్ లైఫ్ లేదు. నలుగురిలో తిరగడం నాలుగు విషయాలు వినడం అప్పటిదాకా ఆమె అనుభవంలో లేదు. ఆమె హోదా అడ్డుగా నిలిచింది. ఇప్పుడు ఏకంగా పెద్ద షాక్ తగలడంతో తట్టుకోలేక పోతోంది. ఇలాంటి విషయాల గురించి వినాలన్న ఉత్సుకత పెరిగింది.
"మహితా! ఏం అనుకోనంటే ఓ మాట అడగనా" అంది సూర్యాదేవి.
"అడుగు"
"ఏమీలేదు, సింపుల్ ఎప్పుడైనా నీ భర్తమీద అసంతృప్తి కలిగిందా?"
మహితా ఆ ప్రశ్నకు పెద్దగా నవ్వేసింది. "ఆ ప్రశ్నను కొంచెం మార్చి అడగాల్సింది. నీ భర్త మీద ఎప్పుడయినా అసంతృప్తి కలిగిందా అని ప్రశ్నించాల్సింది."
"అంతేనంటావా?"
"అక్షరాలా, ఇద్దరు వ్యక్తులు పాలలో నీళ్ళలా, పువ్వులో పరిమళంలా కలిసిపోవడం జరగదు. కవల పిల్లలకి కూడా అది సాధ్యం కాదు.
మరి అలాంటప్పుడు విభిన్న పరిస్థితులలో పెరిగిన ఇద్దరు ఎలాంటి విభేదాలు లేకుండా కాపురం చేయడం సాధ్యమయ్యే పనేనా? ఇదిగో యీ డిఫరెన్స్ వల్లే ఏవేవో జరుగుతుంటాయి."
"పెళ్ళయ్యాక ఏమయినా జరిగిందా నీకు?" బెరుకుతో అడిగింది. అలాంటి ప్రశ్న అడగడం ఇష్టంలేదు. కానీ ప్రస్తుతం ఆమె వున్న పరిస్థితుల్లో అలాంటివి వినడం కాస్తంత వూరట. అందుకే అలా అడిగింది.
"చాలా జరిగాయి. మేమిద్దరం ఎన్నిసార్లు పోట్లాడుకున్నామో లెక్కలేదు. కొన్నిసార్లయితే బావిలో దూకి చద్దామనుకున్నాను"
"పెళ్ళయ్యాక ఎవరిమీదయినా మనసు పడ్డావా?"
ఆ ప్రశ్నకు మహిత ఉలిక్కిపడింది.
సూర్యాదేవివేపు కొత్తగా చూసింది ఆమె ఎప్పుడూ హద్దులు దే మాట్లాడలేదు. ఆ ప్రశ్న అడిగింది ఆమేనా అన్న సంశయంతో చూసింది.
ఎందుకడిగానా అనిపించి తలదించుకుంది సూర్యాదేవి కాసేపు ఇద్దరి మధ్యా మౌనం. ఆకాశపు సిగలో మొగలిపూవు రేకులా వుంది చంద్ర వంక.
"మనసుపడ్డాను" మహిత మెల్లగా ఒక్కో పదానికి గాఢత అద్దుతున్నట్లు అంది.
