శివరావు వడివడిగా నడిచి అతన్ని సమీపించి అన్నాడు.
"నా పేరు శివరావు...."
"గ్లాటూ మీట్ యూ...." విష్ చేశాడతను.
శివరావు అతనికి చెయ్యి అందించాడు.
"ఇక్కడ ఏ హోటల్ బాగుంటుంది...." అడిగాడతను.
"డాల్ఫిన్...." చెప్పాడు.
ఇద్దరూ టాక్సీలో డాల్ఫిన్ హోటల్ చేరుకున్నారు. అతను తన పేరు మీద డబల్ రూమ్ తీసుకున్నాడు. శివరావు అతనితోపాటు రూమ్ కి వెళ్ళాడు. రెండుగంటల తరువాత బయటకొచ్చి లిఫ్ట్ వైపు నడిచాడు.
లక్షరూపాయలు స్వంతం చేసుకోవడానికి తనెంత దగ్గరగా ఉన్నాడో తలుచుకునే సరికి అతని శరీరం పులకించింది.
13
పోలీస్ కమీషనర్ ట్రాన్స్ ఫర్ అయినా నాలుగో రోజున తెల్లవారు ఝామున నాలుగు గంటలకు రాజమ్మ గుండె పోటుతో మరణించింది.
సమయానికి సరియైన వైద్య సహాయం అంధక ఆమె ప్రాణాలు పోయాయి. ఫ్యామిలీ డాక్టర్ ఊరెళ్ళాడు. రాజమ్మని హాస్పిటల్ కి తీసుకుని బయలుదేరిన టాక్సీ మధ్యలో చెడిపోయింది. బంధువులు చూస్తుండగా ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. రాజమ్మ మరణవార్త తెలిసిన మరుక్షణం ఆమె శరీరం శ్మశానం చేరకముందే కంపెనీ అధికారం చేతులు మారింది. రాజమ్మ బంధువులకు కంపెనీ వ్యవహారాలు తెలియవు. ఈ సంగతి రాజమ్మకి అత్యంత విశ్వాస పాత్రుడైన రోశయ్యకి తెలుసు. అంతేకాకుండా కంపెనీలో తనని ఎదురించే వాళ్ళు ఎవరూ లేరని కూడా అతనికి తెలుసు.
వారంరోజుల్లో కంపెనీ తిరిగి నడవడానికి అవసరమైన ఏర్పాట్లు చేసింది రాజమ్మ. రోశయ్య బ్రోకర్లని పిలిచాడు. కంపెనీ నడవడానికి కావాల్సిన ఆడవాళ్ళని రెండురోజుల్లో తీసుకు రమ్మని చెప్పి తలో వెయ్యి రూపాయలు ఇచ్చాడు. రాజమ్మ అంతకుముందు వాళ్ళకిచ్చిన అడ్వాన్సు గురించి తనకి తెలిసినా ఆ విషయం ప్రస్తావించలేదు. బ్రోకర్లు అతను ఇచ్చిన డబ్బు మాట్లాడకుండా తీసుకున్నారు. నగరంలో చాలా కంపెనీలు తిరిగి ప్రారంభమయ్యే దశలో ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయిలకు డిమాండ్ ఎక్కువగా వుంది. బ్రోకర్లు ఇతర కంపెనీలకు అమ్మాయిల్ని ఇవ్వకుండా ఉండటం కోసం ఆ డబ్బు ఇచ్చాడు రోశయ్య. తన దగ్గర డబ్బు తీసుకున్న తరువాత వాళ్ళు తనని మోసం చెయ్యడానికి ప్రయత్నించరని అతని అంచనా.
అప్పటికే అర్చన గురించి సమాచారం సేకరించాడో బ్రోకరు. కొన్ని రోజుల క్రితం ఆమె అతని చేతుల్లోంచి తప్పించుకుంది. ఆ బ్రోకరు ఓ మనిషిని తీసుకుని కురుపాం మార్కెట్ దగ్గరికి వచ్చాడు. చాలాసేపు రామకృష్ణ ఇంటిని గమనించారు. లోపలకు ప్రవేశించే మార్గం వెదికి చీకటి పడిన తరువాత సారా కొట్టుకి నడిచారు.
అర్దరాత్రి వరకూ సారా కొట్టులో కూర్చున్నారు. నోట్లోంచి నీళ్ళూరుతున్నా వాళ్ళు సారా త్రాగలేదు. అక్కడ నుంచి బయలుదేరి రామకృష్ణ ఇంటి వెనుకనున్న సందులోకి ప్రవేశించాడు. బ్రోకరుతోవచ్చిన వ్యక్తి ఎలక్ట్రిక్ పోల్ దగ్గరకు వెళ్ళాడు. నెమ్మదిగా పైకెక్కి ఫ్యూజ్ తీసేశాడు. హఠాత్తుగా చుట్టూ చీకటి అలుముకుంది.
ఇద్దరూ నిశ్శబ్దంగా కాంపౌండ్ వాల్ ఎక్కి లోపలకు దిగారు. చాలాసేపు గోడ ప్రక్కనే కూర్చున్నారు. ఎక్కడా అలికిడి లేదు. వాళ్ళు కళ్ళు చీకటికి అలవాటు పడ్డాయి. పెరట్లో నాలుగు మంచాలు వాళ్ళకి కనిపించాయి. కుడివైపు రెండు, ఎడమవైపు రెండు విడివిడిగా ఉన్నాయి మంచాలు.
బ్రోకరు ఆలోచిస్తూ ఉండిపోయాడు. నాలుగు మంచాల్లో అర్చన పడుకున్న మంచం గుర్తుపట్టాలి. ఏ గొడవ జరగకుండా ఆమెను అక్కడ నుంచి తీసుకెళ్ళాలి.
ఎలా?
తన ప్రక్కనే కూర్చున్న వ్యక్తికి నెమ్మదిగా చెప్పాడు బ్రోకరు.
"నేను మంచాల దగ్గరకు వెళతాను. మనకి కావాల్సిన అమ్మాయిని గుర్తుపట్టి లేచి నిలబడతాను. ఇద్దరం కలిసి ఆమెను మంచంతో పాటు గోడ దగ్గరకు తీసుకు వద్దాం. ఆమె అరవకుండా నువ్వు నోరు ముయ్యి. నేను కాళ్ళూ చేతులు కట్టేస్తాను. తరువాత గోడ మీద నుండి బయటకు దాటిద్దాం...."
"ఎవరైనా లేస్తే...." భయంగా అడిగాడతను.
బ్రోకరు కొన్ని క్షణాలు ఆగి చెప్పాడు.
"పారిపోదాం."
అతను మంచాలవైపు కదిలాడు. అడుగులో అడుగు వేస్తూ సమీపించాడు. ఎడమ వైపునున్న రెండు మంచాల మీద ఇద్దరు ఆడవాళ్ళు పడుకున్నారు. ఒకావిడ అటువైపు తిరిగి పడుకుంది. అందువల్ల ఆమె మొహం కనిపించలేదు. రెండో ఆవిడ మొహానికి పైట చెంగు కప్పుకుంది. ఇద్దరిలో అర్చన ఎవరో అతనికి తెలియలేదు. కొంచెం ముందుకి వంగి మరింత జాగ్రత్తగా చూశాడు. అతను కాళ్ళవైపు ఉండటం వల్ల ఒకామె కాళ్ళకి మెట్టెలు కనిపించాయి. అర్చనకి పెళ్ళి కాలేదనే విషయం తెలియటం చేత ప్రక్క మంచంపైన పడుకున్నామే అర్చన అనే నిర్ధారణకి వచ్చాడు.
అతను లేచి నిలబడ్డాడు.
అందుకోసమే చూస్తున్న ఆ వ్యక్తి మంచాలవైపు నడిచాడు. అతను మంచం దగ్గరకు వచ్చిన తరువాత ఇద్దరూ చెరోవైపు నిలబడ్డారు. వాళ్ళు నడుములు వంచి మంచం కోళ్ళు పట్టుకున్నారు. శక్తంతా చేతుల్లోకి తెచ్చుకుని భూమికి మూడంగుళాల ఎత్తులో మంచాన్ని లేపారు. ఒక్కొక్క అంగుళం కదులుతూ గోడపైన జరగసాగేరు. గోడని సమీపించడానికి పది నిముషాలు పట్టింది. నడుము వంచడం వల్ల ఆ కాస్త దూరానికి వాళ్ళు అలసిపోయారు. మంచం క్రిందపెట్టి నిటారుగా నిలబడి ఆయాసం తీర్చుకున్నారు.
ఆ వ్యక్తి ఒక చేత్తో ఆమె నోరు మూసి, మరో చేత్తో ఆమె చేతులు పట్టుకున్నాడు. బ్రోకరు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రెండూ కాళ్ళూ కట్టేశాడు. మంచంపైననున్న అమ్మాయికి మెలుకువ వచ్చి గింజుకోసాగింది. రెండు చేతులు కూడా తాడుతో కట్టేశాడు బ్రోకరు.
నోరు మూసిన మరుక్షణం ఆమెకు మెలుకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఇద్దరు వ్యక్తులు కనిపించారు. తన కాళ్ళు కట్టేయడం తెలుస్తోంది. భయంతో ఆమె బిగుసుకుపోయింది. తనకి ఏదో ప్రమాదం ముంచుకొచ్చిందనే ఆలోచన మనసులోకి ప్రవేశించింది.
మరుక్షణం తేరుకుంది.
రెండు కాళ్ళూ నిటారుగా చాపి వాటిని అలాగే పైకి లేపి వెనక్కి విరుచుకుపడింది. చీర మొత్తం నడుము వరకూ లేచిపోయింది. అదేమీ పట్టించుకోకుండా ఆమె బిగ్గరగా అరిచింది.
"అన్నయ్యా!"
ఆ నిశ్శబ్ద వాతావరణంలో మారుమ్రోగిందా కేక. రామకృష్ణ శీతయ్య చప్పున లేచారు. ఇద్దరూ గోడ దగ్గరకు పరిగెత్తారు.
అప్పటికే ఒకతను గోడ దాటేశాడు. రెండో అతను గోడ ఎక్కి అవతలకి దూకబోతున్నాడు. పరిగెత్తుతూ వచ్చిన రామకృష్ణ ఓ కాలు మంచంపైన వేసి పైకి లేచి రెండో కాలుతో గోడ దూకుతున్న మనిషిని బలంగా తన్నాడు.
అతను బంతిలా గోడ అవతల నేలని గుద్దుకున్నాడు. కుడి మోకాలు రాయికి తగిలి విరిగిపోయింది. అతను బాధగా అరుస్తూ ప్రక్కకు దొర్లాడు. చెత్త కుప్పలోని ముళ్ళ కంచె మీదకి వెళ్ళింది మొహం. ఆ ప్రదేశం దద్దరిల్లేటట్టు వెర్రిగా అరిచాడతను.
రామకృష్ణ వెనుక వచ్చిన శీతయ్య గోడవతల ఒకతను పరిగెత్తడం గమనించి, వెనక్కి తిరిగి ఇంట్లోంచి రోడ్డుపైకి వచ్చాడు. ఇంటి ప్రక్కనే ఉన్న చిన్న సందు మొదట్లో నిలబడ్డాడు.
పారిపోయి వస్తున్న ఆ వ్యక్తి సందు మలుపు తిరిగి చప్పున ఆగిపోయాడు. శీతయ్యని చూడగానే ఏం చెయ్యాలో పాలుపోలేదు. అతనికి ఎటువంటి ఆవకాశం ఇవ్వకుండా కాలరు పట్టుకొని రామకృష్ణ దగ్గరకు లాక్కొచ్చాడు.
అర్చన ఇంట్లోంచి టార్చిలైటు తెచ్చింది. అప్పటికే కాళ్ళకి, చేతులకి ఉన్న కట్లు విప్పుకుంది సులోచన. రామకృష్ణ టార్చిలైటుతో వాళ్ళ మొహాలు చూశాడు. వాళ్ళని అతను ఎప్పుడూ చూడలేదు.
"వీళ్ళు నీకు తెలుసా?" అర్చనని అడిగాడు.
లక్ష్మీనారాయణతో సహా అంత గోడవతల ఉన్నారు. అర్చన నేల మీదున్న మనిషి మొహం చూసింది. అతని మొహం రక్తంలో ముంచినట్టుంది. కళ్ళనుండి కూడా రక్తం కారుతోంది. ఆ దృశ్యం చూడలేక ఆమె తల ప్రక్కకి తిప్పుకుంది.
"అతని పేరేమిటి?" రామకృష్ణ అడిగాడు రెండో అతన్ని.
"జాన్సన్." చెప్పాడతను.
"కాదు, అతను జనార్దనం" చెప్పింది సులోచన.
నిజమే అన్నట్టు తలూపింది అర్చన. జనార్ధనాన్ని విదేశీయులు జాన్సన్ అని పిలుస్తారు. చాలామందికి అతని పేరు జనార్ధనమని తెలియదు. అతను రాజమ్మ కంపెనీలో బ్రోకరుగా పనిచేస్తున్నాడని చాలాకాలం అర్చనని తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. ఒకసారి మందు ఎక్కువై ఓ అమ్మాయితో అర్చనని ఎలా తీసుకొచ్చిందీ చెప్పాడట. ఆమె అర్చనకి చెప్పింది.
