7. చిత్ర కూటము
సీతారామ లక్ష్మణులు సుమంత్రుడు సిద్దము చేసితెచ్చిన రథమునందాసీనులగుటతోనే రథము కదలి రాజవీధిని పోసాగినది. అయోధ్యాపుర వాసులు అశ్రుపూరిత నయనులై రాజమార్గమున నిరువంకల బారులుగా నిలిచి రామ వనవాసమునకు కారకులైన మంధరనూ కైకేయినీ నిందించుచూ రథమునకై నిరీక్షించినారు. రథము అక్షిగోచరమై తమ్ముదాటి పోవుచుండగా వారు 'మేమునూ అరణ్యమునకు వచ్చెదము' అని ఆక్రందించుచూ రథము వెనుక పరుగెత్తి పోయినారు. రాముడు స్యందనమును ఆపించి దిగివచ్చి 'మిత్రులారా, భరతుడు ధర్మజ్ఞుడు. అతని పరిపాలనమున మీకెట్టి లోపమునూ కలుగదు. మీరు పోయి అతనితో సహకరించడు. నాతో వచ్చి ఏమి ప్రయోజనము?' అని వారించినాడు. తిరిగి తేరును ప్రవేశించి 'సుమంత్రా అర్గదమును శీఘ్రగతిని పోనిచ్చి మమ్ము గంగానదీ తీరమును చేర్చుము" అని కోరినాడు.
గంగానది యొడ్డును చేరుకొనుటతోనే సీతారామ లక్ష్మణులు రథము నుండి దిగినారు. కన్నీటిని ఆపుకొనుటకు వృథా ప్రయత్నము చేయుచూ సుమంత్రుడు వారి నుండి వీడ్కోలును పొంది తేరుతో అయోధ్యకు మరలినాడు.
వారు దిగిన చోటునకు సమీపముననే "శృంగిబేరపురము" ఉన్నది. దానిని రాజధానిగా జేసికొని 'గుహుడు' అను నిషాదరాజు ఆ ప్రాంతమును పాలించుచుండెను. అతడు రాముని ప్రాణసఖుడు. అతడు కానుకలను పట్టించుకొని వారిని దర్శించుటకు వచ్చినాడు. రాముడు కుశల ప్రశ్నల యనంతరము "మిత్రమా మేము వనవాసమున పదునాలుగేండ్లు తాపసవృత్తిని గడపుటకు పోవుచున్నాము. నీవు నా యెడల గల ప్రేమాభిమానములతో తెచ్చిన ఈ కానుకలను స్వీకరించు అర్హత గాని, వీటి వలన ప్రయోజనము గాని మాకిప్పుడు లేవు. నీవు అన్యధా భావించకుము" అన్నాడు. గుహుడు వారు వనవాసమున నెదుర్కొననున్న కేశమును గూర్చి తలపోయుచూ దిగులు చెందినాడు.
అంతవరకునూ హంసతూలికా తల్పముల కలవాటుపడిన సీతారాములా రాత్రి కటిక నేలపై శయనించినారు. గుహుడు లక్ష్మణునితో 'నీవునూ పరుండుము. నేనునూ నా అనుచరులునూ మేల్కొని యుండి మీకెట్టి యాపదయు రాకుండ చూచెదము" అన్నాడు. లక్ష్మణుడు 'మిత్రమా వీరిరువురకును కింకరుడుగా వచ్చిన నేనీ పదునాలుగేండ్లునూ నిద్రను దరిజేయనీయను" అన్నాడు.
మరునాటి ఉదయమున రాముడు గుహునితో 'మిత్రమా మేము గంగానది యావలి యొడ్డును జేరుటకొక నావను సమకూర్చుము" అని కోరినాడు. గుహుడొక పడవను రప్పించినాడు. రాముడా పడవను ప్రవేశించబోగా నిషాదాధిపతి చిరునగవుతో "రామచంద్రప్రభూ ఆగు మాగుము. నీవు విశ్వామిత్ర బ్రహ్మర్షి యాగరక్షణ యనంతరము మిథిలా నగరమునకు బోవుచూ మార్గమధ్యమున పాడుపడి యున్న గౌతమ మహర్షి ఆశ్రమములోని రాతిని నీ పాద రజస్పర్సతో నాతిగా (అహల్యగా) మార్చివేసితివట! ఇప్పుడు నీ చరణధూళి తగిలినచో నా పడవ ఎట్లు మారిపోవునో అన్న ఆందోళన కలుగుచున్నది! కనుక ముందుగా నీ పాదద్వందమును కడిగి ధూళిని తొలగించనిమ్ము" అన్నాడు. రాముడు గుహుని యుక్తికినీ భక్తికినీ స్పందించి, చరణములను అతని ముందుంచినాడు. గుహుడు భక్తితో రాముని కాళ్ళను కడిగినాడు. రాముడునూ పిమ్మట సీతయూ సౌమిత్రియూ (సుమిత్రా నందనుడైన లక్ష్మణుడునూ) పడవను ప్రవేశించగా గుహుడే వారి నావలియొడ్డునకు చేర్చినాడు.
గంగా యమునల సంగమ స్థానము నగల ప్రయాగక్షేత్రమున భరద్వాజ మహర్షి ఆశ్రమమున్నది. సీతారామ లక్ష్మణులు పాదచారులై పోయి ఆ యాశ్రమమును ప్రవేశించినారు. రాముడు శ్రీమహావిష్ణువు అవతారమనియూ జానకి విష్ణువు దేవేరియగు శ్రీదేవి (మహాలక్ష్మి) యవతారమనియూ ఎరిగిన భరద్వాజుడు రాముని 'శ్రీరామా!' యని సంబోధించుచూ ఎదురేగి మువ్వురునూ లోనికి తీసికొని వచ్చినాడు, సంతోష భరితుడై 'మీ రాక వలన నా పర్ణశాల పావనమైనది! నేడు నా యింట మీరు విందును గడువవ'లెను'అని పలికి అర్ఘ్యపాద్యముల నొసంగినాడు.
సూర్యవంశమున రఘు మహారాజు ప్రసిద్దుడు. ఆ మహీధవుని కాలము నుండియూ ఆ వంశము 'రఘువంశము' అని పేర్కొనబడినది. రఘు వంశమున జన్మించిన రాజులలో ప్రఖ్యాత పురుషుడగు రామునకు 'రాఘవుడు' అన్న అభిదానము (పేరు)నూ కలిగినది...విందు అనంతరము రాఘవుడు భరద్వాజుని "మహర్షి పుంగవా, మేము సమీపమున గల యడవిని కొంత కాలముండి పిమ్మట సాంద్రారన్యమును చొచ్చుకొని పోయెదము. నివాస యోగ్యమగు ఒక తావును సూచించుడు" అని అర్ధించినాడు.
భరద్వాజుడిట్లు చెప్పినాడు. "రాఘవా, ఇచ్చటకు పది క్రోసుల దూరములో చిత్రకూటము అను పర్వమున్నది. ఆ కొండ చరియ యందలి కాన్తారము మీకు అనువైనది. అయ్యది తేనెయూ వివిధ రకముల ఫలములునూ పుష్కలముగా లభించుచోటు. అందలి సెలయేళ్ళు స్నానపాన యోగ్యమగు జల సమృద్ది కలవి".
పిమ్మట సీతారామ లక్ష్మణుల ముని వద్ద సెలవు గైకొని చిత్రకూటము వైపు పయనించి ఆ అచలమును అనతి కాలముననె చేరుకొన్నారు. ఆ విపినమున నేత్రపర్వమగు ఒక స్థలమున లక్ష్మణుడు సీతారాములకు నివాస యోగ్యమగు ఒక కుటీరమును నిర్మించినాడు. అయోధ్యను విడిచి వచ్చితిమన్న విచారము లేకుండ వారు వనవాసమును ప్రారంభించినారు. *
