పవన్ స్పీచ్... హిట్టా? ఫ్లాపా??
on Aug 29, 2016
రెండ్రోజులుగా పవన్ ముచ్చట్లే వినిపిస్తున్నాయి. తిరుపతిలో అనర్గళంగా గంటసేపు మాట్లాడిన వైనం... పవన్ అభిమానుల ముందు గిర్రు గిర్రున తిరుగుతోంది. అప్పుడే ప్రతిపక్షాలు విమర్శలు మొదలెట్టేశాయి. పవన్పై వ్యంగ్య బాణాలు విసిరేస్తున్నాయి. తిట్టూ, శాపనార్థాలూ మామూలే. పవన్ అభిమానులు 'మావోడు మా గొప్పగా మాట్లాడాడు' అంటూ మురిసిపోతుంటే.. మిగిలిన వాళ్లు `ఈసారి ఎంత ప్యాకేజీ ఇచ్చారో` అంటున్నారు. ఈ మాటలు పక్కన పెట్టి చూస్తే.. పవన్ సభ రిజల్ట్ ఏంటి? సినిమా భాషలో చెప్పాలంటే... పవన్ స్పీచ్ హిట్టా, ఫ్లాపా?
ప్రశ్నించడానికే పార్టీ పెట్టా అని చెప్పిన పవన్ ఎన్నికలయ్యాక జనం ముందుకు వచ్చింది లేదు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది లేదు. ఏదో ట్విట్టర్లో అప్పుడప్పుడు స్టేట్మెంట్లు పెట్టడం తప్ప.. పవన్ ప్రభావం ఎక్కడా ఎప్పుడూ కనిపించలేదు. ప్రత్యేక హోదా గురించి సీరియస్ గా మాట్లాడలేదు కూడా. అందుకే పవన్ని రబ్బర్సింగ్ అంటూ కొంతమంది హేళన చేశారు. పవన్కల్యాణ్ కాదు... ప్యాకేజీ కల్యాణ్ అంటూ పవన్ నిజాయతీని శంకించారు. ప్రత్యేక హోదా గురించి పోరాడే నాయకుడు లేకపోవడంతో... ఆ పోరాటం నిస్తేజంగా మారింది. ఈ సమయంలోనే పవన్ మైకు అందుకొన్నాడు. తిరుపతిలో అర్జెంటుగా సభ పెట్టాడు. నిజానికి ఇలాంటిసభలు నిర్వహించడానికి తగినంత సమయం తీసుకొంటాయి రాజకీయ పార్టీలు, జన సమీకరణకు, అక్కడి ఏర్పాట్లకు, పోలీసుల అనుమతులకు సమయం అవసరం కూడా. కానీ పవన్ మాత్రం లేచిందే లేడికి పరుగు అన్నట్టు మీటింగ్ ఎనౌన్స్ చేశాడు. ఆశ్చర్యకరమైన రీతిలో.. పవన్కి అప్పటికప్పుడు అన్నీ సమకూరాయి. ఎలాంటి తరలింపు కార్యక్రమాలూ లేకుండా అభిమానులు స్వచ్ఛందంగా పవన్ సభకు హాజరయ్యారు. ఇది పవన్ సాధించిన మొదటి విషయం.
పవన్ సభలో రొటీన్ విషయాలే బయటకు వచ్చాయి. కొత్తగా చెప్పిందేం లేదు. అయితే ప్రభుత్వంపై పోరాటం చేస్తానని మాత్రం క్లారిటీ ఇచ్చాడు. పవన్ మాట్లలో ఎప్పటిలా నిజాయతీ కనిపించింది. `నేను ఒకరు తొత్తు కాదు` అని స్పష్టంగానే చెప్పగలిగాడు. ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకూ పోరాటం ఆగదని చెప్పేశాడు. దాంతో ప్రత్యేక హోదా కోసం ఎదురుచూస్తున్న కోట్లాది హృదయాలు ఊరట చెందాయనడం కాదనలేని సత్యం. తమ కోసం మాట్లాడడానికి ఒకడొచ్చాడన్న భరోసా కలిగింది. అయితే పవన్ ఎక్కడా టీడీపీని ని తిట్టలేదు. చంద్రబాబు నాయుడు ప్రస్తావన తేలేదు. కర్ర విరక్కుండా.. పాము చావకుండా అన్నట్టు వ్యవహరించడం, అన్నయ్య చిరంజీవిని ఒక్క మాట కూడా అనకపోవడం మాత్రం సందేహం కలిగిస్తోంది.
మొత్తానికి పవన్ కల్యాణ్లోని సిసలైన పోరాట యోధుడు మళ్లీ బయటకు వచ్చాడు. ఆ ఆవేశం... రోజులా, నెలలా, లేదంటే ఆశయం సాధించే వరకా అన్నదే డౌటు. సభ వరకూ మాత్రమే మాట్లాడుకొంటే కచ్చితంగా హిట్టే. ఎందుకంటే పవన్ తనపై ఉన్న నిందలన్నీ చెరిపేసి.. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడిక్కడ. అటు కేంద్రానికీ, ఇటు రాష్ట్రానికీ కౌంట్ డౌన్ మొదలైపోయిందన్న సంకేతాలూ పంపాడు. సో... పవన్ స్పీచ్ హిట్టయినట్టే లెక్క!