ENGLISH | TELUGU  

తెలుగు తెరకు ‘మాస్’అనే పదం పుట్టిన వేళ...

on Aug 4, 2017

 

తెలుగు తెరకు ‘మాస్’అనే పదం పుట్టిన వేళ...

ఇప్పుడు మనం చెప్పకోబోయేది... చరిత్ర మరిచిపోలేని సంఘటన.... 

ఓ సామాన్య వ్యక్తి.. అసామాన్య శక్తిగా రూపాంతరం చెందేందుకు నాందిగా నిలిచిన సంఘటన....

ఈ రోజున హీరోలందరూ ఆరాటపడే ‘మాస్ ఇమేజ్’అనే క్రేజ్ కి బీజం పడింది ఈ  సంఘటనతోనే...

ఇక వివరాల్లోకెళ్దాం-
అది 1950వ సంవత్సరం. ‘షావుకారు’ సినిమా తీసి చేతులు కాల్చుకున్న విజయాధినేతలు నాగిరెడ్డి-చక్రపాణి... మలి ప్రయత్నానికి శ్రీకారం చుట్టి... మంచి కథ కోసం అన్వేషిస్తున్న రోజులవి. ఈ సారి ఎలాగైనా హిట్ కొ్ట్టాలనేది వారి దృఢనిశ్చయం. ఎట్టకేలకు ‘పాతాళభైరవి’కథ  ఓకే అయ్యింది. దర్శకుడిగా కె.వి.రెడ్డి ఖరారు. ఇక కావాల్సింది హీరో. ఎవరైతే బావుంటుంది? అనే ఆలోచనల్లో మునిగిపోయారు దర్శక, నిర్మాతలు. 

అప్పట్లో జానపద హీరో అంటే అక్కినేనే. అప్పటికే ముగ్గురు మరాఠీలు, బాలరాజు, కీలుగుర్రం తదితర జానపద చిత్రాల్లో నటించి హీరోగా మంచి ఊపుమీదున్నారాయన. ఆయనతోనే ‘పాతాళభైరవి’కానిచ్చేద్దాం అన్నారు నాగిరెడ్డి-చక్రపాణి. కానీ... కె.వి.రెడ్డి ఆలోచన వేరేగా ఉంది. ‘తోటరాముడి’పాత్రకు తను ఊహించిన లక్షణాలు అక్కినేనిలో లేవని ఆయన ఉద్దేశ్యం. అందుకే కొత్తవారి కోసం చూస్తున్నారాయన. ఎట్టకేలకు  ఒడ్డూ పొడుగూ బాగుండటంతో... ‘రాజారెడ్డి’అనే వ్యక్తిని ఆ పాత్రకు ఓకే చేశారు. తీరా డైలాగ్ చెప్పమనే సరికి అసలు విషయం బయటపడింది. ఆయనకు కొద్దిగ నత్తి. దాంతో నిర్ధాక్షిణ్యంగా ఆయన్ను తప్పించేశారు కె.వి.రెడ్డి. మళ్లీ కథ మొదటికొచ్చింది. నిర్మాతల దృష్టి మాత్రం  అక్కినేని పైనే. కె.వి.రెడ్డి మాత్రం ఆ విషయంలో అసంతృప్తిగానే ఉన్నారు. ఇదిలావుంటే... సరిగ్గా ఆ రోజు సాయంత్రం జరిగింది ఆ సంఘటన. 

విజయా గార్డెన్లో నాగిరెడ్డి, చక్రపాణి, కె.వి.రెడ్డి కూర్చొని ఉన్నారు. వారికి కొంత దూరంలో ఇద్దరు కుర్రాళ్లు టెన్నీస్ అడుతున్నారు. ఆ కుర్రాళ్లు ఎవరో కాదు... తెలుగు తెరను దశాబ్దాల పాటు శాసించిన మహానటులు ఎన్టీయార్, ఏఎన్నార్. మాటల్లో మునిగి వున్నముగ్గురు పెద్దల దృష్టి అనుకోకుండా ఆ ఇద్దరి ఆట మీద మళ్లింది.  

ఆట మంచి రసపట్టులో ఉంది. దాంతో పెద్దలు ముగ్గురూ అలా ఆటను చూస్తుండి పోయారు. అయితే... ప్రతి సారి గెలుపు మాత్రం అక్కినేనినే వరిస్తుంది. దీంతో ఎన్టీయార్ చిరాగ్గా ఉన్నారు. ఓ వైపు పెద్దలు ముగ్గురూ ఆటను ఆసక్తితో గమనిస్తున్నారు. ప్రతి సారీ... ఓటమే పలకరిస్తుండటంతో ఎన్టీయార్ ముఖంలో రంగులు మారుతున్నాయ్. ఇక ఎన్టీయార్ కు అసహనం తారాస్థాయికి చేరింది. తన ఆటపై తనకే అసహ్యం వేసి... ఆ కోపం మొత్తం బంతి మీద చూపించారు. రెండు చేతులతో బ్యాట్ ని గట్టిగా పట్టుకొని బలంగా బంతిని ఈడ్చి కొట్టారు. అంతే.. ఆ బంతి విజయా గార్డెన్ గోడ అవతల పడి దొరక్కుండా పోయింది. ఆ సంఘటన చూసిన డైరెక్టర్ కె.వి.రెడ్డి ముఖంలో ఏదో సాధించాననే కొత్త ఆనందం కనిపించింది. అది గమనించిన నిర్మాతలిద్దరూ ‘ఏంటయ్యా... అలా ఉన్నావ్? అన్యమనస్కంగా’అని అడిగారు. 


‘హీరో దొరికాడండీ... నా తోటరాముడు దొరికాడు’అని సమాధానమిచ్చారు కేవీ. ‘దొరికాడా? ఎవరు... నాగేశ్వర్రావా?’అనడిగారు చక్రపాణి. ‘కాదు రామారావు’అని సమాధానమిచ్చాడు కె.వి.రెడ్డి. అంతే నిర్మాలిద్దరూ షాక్. 

కొత్త కుర్రాడు... పైగా ఇప్పటివరకూ సరైన ఒక్క సినిమా కూడా చేయలేదు. మరి ఇంత భారాన్నీ తను మోయగలడా..! అనేది వారి అనుమానం. అయితే... కేవీరెడ్డి మీద మాత్రం వారికి అపారమైన నమ్మకం. అందుకే భారం మొత్తం కేవీ పైనే వేసి.. అంగీకరించేశారు. అయితే... అసలు ఎన్టీయార్ ‘తోట రాముడు’పాత్రను సమర్ధవంతంగా పోషించగలడా? అనే అనుమానం దర్శక, నిర్మాతల్లో లేకపోతేదు. అందుకే... కొసరుగా ముందు ఒక సన్నివేశం చేయించి చూద్దాం అనుకొని ఎన్టీయార్ ని పిలిపించారు. 

కథలో కీలకమైన సన్నివేశం అది. పాతాళభైరవి ఉన్న ప్రదేశానికి వెళ్లాలంటే... అడ్డుగా ఉన్న బొడ్డుదేవర విగ్రహాన్ని పక్కనే గదాయుధంతో పగలగొట్టాలి. ఇది సీన్. ‘ఆ పక్కనే పెట్టివున్న గదాయుధాన్ని బలంగా పైకి లేపి... మూడు దెబ్బల్లో విత్ ఎక్స్ ప్రెషన్ తో.. ఆ విగ్రహాన్ని పగులగొట్టాలి’అని సీన్ వివరించి... కె.వి.రెడ్డి ‘యాక్షన్’అన్నారు. అంతే... అన్నగారు తోటరాముడు అయిపోయారు. అద్భుతమైన హావభావాలతో... గదాయుధాన్ని పైకి లేపారు.. మూడు దెబ్బల్లో బొడ్డుదేవర బొడ్డు బద్దలైంది. ఎన్టీయార్ ఆ సీన్ ని పండించిన తీరుకు కె.వి.రెడ్డి పులకించిపోయారు. ‘వీడే... వీడే నా తోటరాముడు...’ అంటూ ఆనందంతో మురిసిపోయి ఎన్టీయార్ ని గుండెలకు హత్తుకున్నారు. 

ఆ ఘడియ సాధారణమైన ఘడియ కాదు. తెలుగు తెరకు తొలి సూపర్ స్టార్ ఉద్భవించిన ఘడియ.  సినిమాతో ‘మాస్’అనే పదం మమేకమైన ఘడియ. ‘మాస్ హీరో’ అనే క్రేజ్ మొదలైంది అక్కడ్నుంచే. ఇప్పుడొస్తున్న మాస్ హీరో పాత్రలన్నీ... ఓ విధంగా తోటరాముడి సంతతి. తెరపై తెగింపు, ధైర్యం, సాహసం... వీటన్నింటికీ పునాది వేసింది తోటరాముడే. ఆ విధంగా తెలుగు తెరకు తోలి సూపర్ స్టార్ గా అవతరించారు ఎన్టీయార్. 

‘మాస్’అంటే ప్రజలు. ‘హీరో’అంటే నాయకుడు. ‘మాస్ హీరో’ అంటే... ‘ప్రజా నాయకుడు’. ఆ విధంగా ‘పాతాళభైరవి’ నుంచి తెరపై హీరోని ప్రజానాయకుడిగా చూడటం మొదలుపెట్టారు జనం. తర్వాత కాలంలో నిజంగానే ప్రజానాయకునిగా మారి ‘ముఖ్యమంత్రి’ పీఠాన్ని కైవసం చెసుకున్నారు ఎన్టీయార్. 

ఆనాడు దిగ్దర్శకుడు కె.వి.రెడ్డిగారు నాటిన ఆ బీజం.. ఆయన సృష్టించిన ఆ వురవడి... నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇంతటి అద్వితీయమైన చరిత్రకు కారణమైన కె.వి.రెడ్డి గారికి సినిమా అభిమానులందరూ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఏమంటారు ఫ్రెండ్స్.

 

- నరసింహ బుర్రా


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.