దేశంలోనే రిచ్చెస్ట్ ఎంపీ..

 

రాజకీయాల్లోకి వచ్చి  కావాల్సినంత సంపాదించుకోవచ్చు అని ఎన్ని సినిమాల్లో డైలాగులు వినలేదు. ఒక్కసారి పదవులు వచ్చాయంటే చాలు ఆస్తులు ఆమాంత పెరిగిపోతుంటాయి. ఇప్పుడు ఈ ఉపోద్ఝాతం అంతా ఎందుకంటారా..? అలా సంపాందించే ఓ ఎంపీ గారు ఏకంగా దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీగా అవతరించారు. ఆయన ఎవరో కాదు... బీహార్‌కు చెందిన మహేంద్ర ప్రసాద్ అలియాస్ కింగ్ మహేంద్ర. ఈయన ఆస్తి విలువ అక్షరాల 4వేల కోట్లు.  బీహార్‌ రాష్ట్రంలో రాజ్యసభకు ఆయన జేడీ(యూ) అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆ పార్టీ తరపున పోటీ చేయడం ఆయనకిది మూడోసారి కావడం గమనార్హం. ఏడోసారి పార్లమెంటులో ప్రవేశించడానికి ఆయన సిద్ధమవుతున్నారు. కింగ్ తన ఎన్నికల అఫిడవిట్‌లో చరాస్తులు రూ.4010.21 కోట్లుగా, స్థిరాస్తులు రూ.29.1 కోట్లుగా చూపించారు.

 

కింగ్ మహేంద్ర తనకున్న రెండు ఫార్మా కంపెనీలకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో టర్మ్ డిపాజిట్లు రూ.2239 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. అలాగే రూ.41 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నాయి. అయితే ఇంత సంపన్న ఎంపీ అయిన మహేంద్ర పేరుపై వాహనాలు గానీ బీమా పాలసీలు గానీ లేకపోవడం గమనార్హం. అంతేకాదు ఆయనకు ఇంకో రికార్డ్ కూడా ఉంది. అత్యధిక దేశాలు పర్యటించిన ఎంపీగా ఈయనకు పేరుంది. ఏప్రిల్ 9, 2002 నుంచి ఏప్రిల్ 8, 2003 మధ్యకాలంలో ఆయన ఏకంగా 84 దేశాల్లో పర్యటించడం విశేషం. మొత్తం 211 దేశాలను ఆయన చుట్టారు.