కన్నతండ్రి కార్తీక్ను దోషిలా చూస్తున్న పిల్లలు!
on Sep 25, 2021
మోనిత జైలుకు వెళ్లిందన్న మాటే కానీ కార్తీక్ కుటుంబ సభ్యులకు ప్రశాంతత అనేది కరువైంది. ఏదో ఒక కొత్త సమస్య వచ్చి పడుతుండటంతో మనఃశాంతి అనేది లేకుండా పోతోంది. ఇప్పుడు కొత్తగా వచ్చి పడిన సమస్య... పిల్లలకు మోనిత విషయం తెలియడం! దాంతో 'కార్తీక దీపం' సీరియల్ మరింత భావోద్వేగభరితంగా మారింది. పిల్లల ఏడుస్తూ ఉండటం టీవీల ముందు సీరియల్ చూస్తున్న వీక్షకుల గుండెలు ద్రవించిపోతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
ఫీజు కట్టడానికి పిల్లల్ని స్కూల్ దగ్గర కార్తీక్ దింపేసి వెళ్లిన సంగతి తెలిసిందే. స్కూల్ లో హిమ, శౌర్య దగ్గర తండ్రి కార్తీక్ అరెస్ట్ గురించి స్కూల్ మేట్ షైనీ ప్రస్తావిస్తుంది. తప్పంతా కార్తీక్దేనని, కార్తీక్-మోనిత మధ్య ఏదో ఉందని, మోనితను కార్తీక్ చీట్ చేశాడని షైనీ అనడంతో పిల్లలు ఇద్దరికీ కోపం వస్తుంది. ఆ తర్వాత ఏడుపు వస్తుంది. వాళ్ళను పికప్ చేసుకోవడానికి వెళ్లిన కార్తీక్ తో ముభావంగా ఉంటారు.
ఇంటికి వచ్చిన తర్వాత కూడా షైనీ చెప్పిన మాటల గురించి కార్తీక్ పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు. 'స్కూల్ కి వెళ్ళినప్పుడు పిల్లలు బాగానే ఉన్నారు. వచ్చేటప్పుడు మాట్లాడలేదు' అని దీప వ్రతం కోసం పువ్వులు గుచ్చుతున్న తల్లి సౌందర్యతో కార్తీక్ తన బాధను పంచుకుంటాడు. పిల్లలు తనను దోషిలా చూస్తున్నారని చెబుతాడు. దీనిబదులు కోర్టులో తనకు శిక్ష పడితే బాగుండేదని ఆవేదన చెబుతాడు. సరిగ్గా అప్పుడే అటు వెళ్తున్న శౌర్యను సౌందర్య పిలిచినా పట్టించుకోకుండా వెళ్తుంది. దాంతో ఏదో అయ్యిందని సౌందర్యతో అర్థమైంది. అది తెలుసుకునే పనిలో పడింది.
Also Read