ENGLISH | TELUGU  

కళామతల్లి కన్నీరు పెట్టుకుంది.. సినీపరిశ్రమ మూగబోయింది

on Nov 30, 2021

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన మరణం తెలుగు సినీపరిశ్రమకు తీరని లోటు అంటూ ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

"తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను." అంటూ జగన్ ట్వీట్ చేశారు.

"అద్భుత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మృతి వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. దాదాపు 3000లకు పైగా పాటలు రాసి సంగీత ప్రియులను అలరించిన పద్మశ్రీ సీతారామశాస్త్రి గారి మరణం తెలుగు సాహితీ లోకానికే తీరని లోటు. సీతారామశాస్త్రి గారి ఆత్మశాంతికై భగవంతుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితి విషయమని వార్తలొస్తున్న సమయంలో "మీ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న" అని ట్వీట్ చేసిన బాలకృష్ణ.. సిరివెన్నెల మరణవార్త తెలిసిన తర్వాత "కళామ్మతల్లి కన్నీరు పెట్టుకుంది.. సినీపరిశ్రమ మూగబోయింది" అని ట్వీట్ చేశారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.