రోహిత్.. శ్రీవిష్ణు... తప్పు చేశారా?
on Oct 24, 2018
ఇండియాలో ఈ శుక్రవారం విడుదల కానున్న 'వీరభోగ వసంతరాయలు' సినిమా ప్రీమియర్ షోలు అమెరికాలో మంగళవారమే పడ్డాయి. అంటే... ఇండియాలో విడుదలకు మూడు రోజుల ముందు అమెరికాలో విడుదల చేశారు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలను ఒక్కరోజు ముందు మాత్రమే అమెరికాలో విడుదల చేస్తారు. మూడు రోజుల ముందు అక్కడ 'వీరభోగ వసంతరాయలు' విడుదల చేస్తున్నారంటే సినిమాపై హీరోలకు, దర్శకుడికి, నిర్మాతకు ఎంత నమ్మకమో అనుకున్నారంతా!
అమెరికాలో షోలు పడిన తరవాత నారా రోహిత్, శ్రీవిష్ణు తప్పు చేశారా? అనే అభిప్రాయాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో 'వీరభోగ వసంతరాయలు' టాక్ ఏమంత బాగోలేదు. ఫ్లైట్ హైజాక్, చిన్నారుల కిడ్నాప్ వంటి అంశాలతో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ ఉత్కంఠభరితంగా లేదని అక్కడ సినిమా చూసిన విమర్శకులు తేల్చేశారు. కథల ఎంపికలో మంచి అభిరుచి వుందని పేరు సంపాదించుకున్న నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు ఈ కథలో నటించడానికి ఎలా అంగీకరించారో? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పక్కింటి కుర్రాడు తరహా పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీవిష్ణు సినిమాలో పాత్రకు అసలు నప్పలేదని, మిస్ కాస్ట్ అని చెప్తున్నారు.
సుధీర్ బాబు ముందు నుంచి సినిమాకు దూరంగా వున్నారు. డబ్బింగ్ కూడా చెప్పలేదు. ఇప్పుడు సినిమాను తమ భుజాలపై మోస్తూ.. నారా రోహిత్, శ్రీవిష్ణు పబ్లిసిటీ చేస్తున్నారు. మూడు రోజుల ముందు అమెరికాలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకోవడం ద్వారా వారిద్దరూ తప్పు చేశారేమో అని ఇండస్ట్రీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు. కాన్సెప్ట్ బేస్డ్ సినిమా కావడంతో అమెరికాలో ఆడలేదంటే ఇండియాలో ఆడుతుందా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
సినిమాలకు ఇంటర్నెట్ ఒక్కోసారి ఎంత మంచి చేస్తుందో? ఒక్కోసారి అంతే చేటు చేస్తుంది! నెట్ సౌకర్యం కారణంగా ప్రపంచం ఇప్పుడు ఒక కుగ్రామంగా మారింది. ప్రపంచంలో ఏ మూలన షోలు పడినా చాలు... క్షణాల్లో టాక్ ప్రపంచమంతటా విస్తరిస్తోంది. మౌత్ టాక్ బావుంటే పర్లేదు. బ్యాడ్ టాక్ వస్తే మాత్రం ఫలితంపై ప్రభావం చూపడం ఖాయం!!