సినిమాని గెలిపించేవాళ్ల కన్నా ఓడించేవాళ్లు ఎక్కువవుతున్నారు!
on Dec 17, 2019
ఇవాళ దర్శకుడికి ప్రతి సినిమా చివరి సినిమా లాగా అయిపోయిందనీ, సినిమాని గెలిపించేవాళ్లకన్నా ఓడించడాన్ని చూసేవాళ్లు ఎక్కువవుతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశాడు 'మహర్షి' డైరెక్టర్ వంశీ పైడిపల్లి. 'వెంకీమామ' థ్యాంక్యూ మీట్లో పాల్గొన్న ఆయన నేటి రోజుల్లో కమర్షియల్ ఎంటర్టైనర్ తీసి మెప్పించడం చాలా కష్టమనీ, 'వెంకీమామ'తో బాబీ అది సాధించాడనీ కితాబిచ్చాడు. "ఇవాళ ఒక డైరెక్టర్కు సినిమా చెయ్యడమంటే ఏమిటో నాకు తెలుసు. ప్రతి సినిమా ఒక చివరి ఇన్నింగ్స్ లాంటిదే. 'కలియుగ పాండవులు' సినిమా షూటింగ్ బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్క్లూల్లో జరిగింది. అప్పుడు నేనక్కడ థర్డ్ క్లాస్ స్టూడెంట్ని. వెంకటేశ్గారిని నేను తొలిసారి చూసిందక్కడే. తర్వాత 'బొబ్బిలి రాజా' రిలీజయ్యింది. 'అయ్యో అయ్యో అయ్యయ్యో' అని మెప్పించారు. ఆ సినిమాని ఎన్నిసార్లు చూశానో గుర్తులేదు. దాని 200 రోజుల ఫంక్షన్ నిజాం కాలేజీ గ్రౌండ్స్లో జరిగింది. ఆ మరుసటి రోజు మాకు మేథ్స్ ఎగ్జాం. అయినప్పటికీ ఆ ఫంక్షన్కు వెళ్లి, జనాల్లో దెబ్బలు తింటూ చూశాం. ఈరోజు ఆయన ముందు నిల్చొని మాట్లాడుతున్నా. నేను ఆయనతో మాట్లాడిన సందర్భాలు తక్కువే అయినా, ఇండస్ట్రీ వ్యక్తుల్లో అత్యంత స్వచ్ఛమైన మనసున్నవాళ్లలో వెంకటేశ్ ఒకరు" అని ఆయన చెప్పాడు.
చైతన్య 'జోష్' వంటి సినిమాతో కెరీర్ మొదలుపెట్టి, ఇవాళ తనదైన ఒక మార్గంలో ముందుకు వెళ్తున్నాడని ఆయనన్నాడు. "నిన్న 'మజిలీ', నేడు 'వెంకీమామ', రేపు శేఖర్ కమ్ముల సినిమాతో సరైన బ్యాలెన్స్తో వెళ్తున్నాడు. వెంకటేశ్, చైతన్య సినిమాలో నటించినట్లు కనిపించలేదు. వాళ్లిద్దరి మధ్య ఉన్న బంధమే తెరపై కనిపించింది. 'వెంకీమామ' ఒక ఫిల్మ్ కాదు. డైరెక్టర్ బాబీ వాళ్లిద్దరికీ ఒక జ్ఞాపకాన్ని ఇచ్చాడు. చైతన్య రేపు తన పిల్లలకు, మనవళ్లకు 'నేను మా మామ ఇలా ఉండేవాళ్లంరా' అని చూపించుకొనే సినిమా ఇది. 'మనం', 'వెంకీమామ' లాంటి సినిమాలు చేసే అవకాశం చాలా తక్కువమందికే లభిస్తాయి. హార్డ్వర్క్తోటే రాశీ తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడున్న స్థాయికి చేరుకుంది. వరుస సినిమాలతో ఎక్కడ చూసినా రాశీ, తమన్ గాడే కనిపిస్తున్నారు. 'ఆర్ఎక్స్ 100'లో అదరగొట్టిన పాయల్ ఈ సినిమాలో కామెడీ సీన్లతో ఆకట్టుకుంది. ఆమెకు మంచి భవిష్యత్తు ఉంది. నా బ్రదర్ లాంటి తమన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. తమన్ సక్సెస్ను వాళ్లమ్మ గారు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో నాకు తెలుసు. అతని సక్సెస్ను వాళ్ల నాన్నగారు చూడలేకపోయారు. సెట్లో రాం-లక్ష్మణ్ ఉంటే డైరెక్టర్కు వచ్చే ఎనర్జీయే వేరు. వాళ్లను కలిగివున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీది అదృష్టం. దురదృష్టవశాత్తూ కమర్షియల్ ఎంటర్టైనర్ను తక్కువచేసే రోజులొచ్చాయి. ఈ రోజుల్లో కమర్షియల్ ఎంటర్టైనర్ తీసి మెప్పించడం చాలా కష్టం. మా ఖర్మగాలి కమర్షియల్ సినిమాలో అన్ని జానర్లూ ఉండాలి. ఎమోషన్స్ను ఎంటర్టైన్మెంట్తో మిళితం చేసి 'వెంకీమామ'ను బాబీ చాలా బాగా తీశాడు. రచయిత నుంచి డైరెక్టర్గా ఇక్కడిదాకా వచ్చిన అతడి ప్రయాణం నాకు తెలుసు. ఎంతో శ్రమతో అతను ఇక్కడిదాకా వచ్చాడు. ఇవాళ ప్రతి సినిమాని దర్శకులుగా మేం ప్రాణంపెట్టి చేస్తున్నాం. ఇవాళ సినిమాని గెలిపించేవాళ్ల కన్నా ఓడించేవాళ్లను చూసేవాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. మమ్మల్ని గెలిపిస్తున్న ప్రేక్షకులకు థాంక్యూ" అని చెప్పుకొచ్చాడు వంశీ.