'వకీల్ సాబ్'కు గట్టి షాక్ ఇచ్చిన జగన్ సర్కార్!
on Apr 8, 2021
ఓపెనింగ్స్తో రికార్డుల మోత మోగించాలని ఆశపడ్డ 'వకీల్ సాబ్'కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. రెగ్యులర్గా ఉండే నాలుగు షోలకు అదనంగా షోలను ప్రదర్శించుకొనేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా నిర్మాతలు చేసిన రిక్వెస్ట్ను తోసిపుచ్చింది. ఏప్రిల్ 9 శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 'వకీల్ సాబ్'ను రిలీజ్ చేస్తున్నారు. మార్నింగ్ 5 గంటల షో వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించగా, జగన్ సర్కార్ మాత్రం మొండిచేయి చూపింది. అంతేకాదు, సినిమా విడుదలైన రెండు వారాల దాకా టిక్కెట్ ధరలను పెంచుకోవడానికి కూడా ఏపీ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో నార్మల్ రేట్లకు టిక్కెట్లను అమ్మనున్నారు.
'వకీల్ సాబ్' సినిమా విషయంలో జగన్ సర్కార్ రాజకీయ ధోరణితో వ్యవహరిస్తోందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాజకీయ ప్రత్యర్థి అయినందువల్లే పవన్ కల్యాణ్ సినిమా విషయంలో ప్రభుత్వాధికారులు నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. గతంలో బిగ్ స్టార్స్ సినిమా విడుదలయినప్పుడు ఎక్స్ట్రా షోలు వేసుకోవడానికి, టికెట్ ధరలు పెంచుకోవడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులిస్తూ వచ్చాయి. దీని వల్ల భారీ ఓపెనింగ్స్ సాధ్యమై, ప్రి బిజినెస్లో అత్యధిక శాతాన్ని తొలి వారంలోనే రాబట్టుకొనేవారు నిర్మాతలు, బయ్యర్లు. ఒకవేళ నెగటివ్ టాక్ వచ్చినా భారీ ఓపెనింగ్స్ వల్ల నష్టాన్ని కొంత పూడ్చుకొనే అవకాశం కలిగేది.
అందుకే 'వకీల్ సాబ్' విషయంలోనూ దిల్ రాజు, డిస్ట్రిబ్యూటర్లు అదనపు షోలకు, టికెట్ ధరల పెంపుకూ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చినా, ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతికూల స్పందన రావడంతో వారు షాక్కు గురయ్యారు. దీంతో ఏపీ బయ్యర్లలో కలవరం కనిపిస్తోందని అంటున్నారు. బెనిఫిట్ షోలకు, మిడ్నైట్ షోలకు జగన్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడానికి తిరస్కరించడంతో వారు ఎటూ పాలుపోని స్థితిలో పడ్డారు. అయితే ఇప్పటికే బుక్ మై షోలో కొన్ని ఏరియాల్లో ఉదయం ఎనిమిది గంటల షోకు టిక్కెట్లు విక్రయించి, వాటిని కేన్సిల్ చేశారు. టిక్కెట్ డబ్బుల్ని రిఫండ్ చేశారు. ఉదాహరణకు ఒంగోలులోని గోపి థియేటర్లో ఎనిమిది గంటల షోకు టిక్కెట్లు అమ్మారు. టిక్కెట్ ధర రూ. 300. కానీ తర్వాత వాటిని కేన్సిల్ చేసి, డబ్బు వాపస్ చేశారు. చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొనడంతో పవన్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.