మీడియా ఆ విషయాన్ని చూపించలేదు.. పవన్ నాతో ఆ మాట చెప్పారు: విష్ణు
on Oct 18, 2021
బండారు దత్తాత్రేయ ఆదివారం నాడు నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, 'మా' అసోసియేషన్ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో వేదికపై పక్కపక్కనా కూర్చున్నా ఇద్దరూ మాట్లాడుకోలేదని, విష్ణుని పవన్ పట్టించుకోలేదని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను తాజాగా మంచు విష్ణు ఖండించారు.
పవన్ కళ్యాణ్ గారు, తాము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని.. తమ మధ్య విభేదాలు లేవని విష్ణు తెలిపారు. స్టేజ్ పైకి వెళ్లక ముందు తామిద్దరం చాలా సేపు మాట్లాడుకున్నామని.. ఆ విషయాన్ని మీడియా చూపించలేదని అన్నారు. పవన్ సహాయ సహకారాలు కూడా 'మా'కు కావాలని విష్ణు అన్నారు. 'మా' మన తల్లివంటిదని.. జాగ్రత్తగా చూసుకోమని పవన్ తనతో చెప్పారని వెల్లడించారు. అంతేకాకుండా తన తండ్రి మోహన్బాబు- చిరంజీవి నిన్న ఫోన్లో మాట్లాడుకున్నట్లు విష్ణు తెలిపారు.
కాగా, రాజకీయ ఎన్నికలను తలపించిన 'మా' అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ మద్దతు ప్రకాష్ రాజ్ ప్యానల్ కి ఉండటం, ప్రచారంలో పవన్ పేరుని ప్రస్తావించి విమర్శలు చేయడం, ప్రకాష్ రాజ్ ఓటమి తర్వాత మా సభ్యత్వానికి నాగబాబు రాజీనామా చేయడం వంటివి చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో అలాయ్ బలాయ్ కార్యక్రమంలో పవన్ విష్ణుని అసలు పట్టించుకోలేదని ప్రచారం జరిగింది. దీంతో విష్ణు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు.
Also Read