'ఆదిపురుష్'లో లక్ష్మణ పాత్రధారి కూడా వచ్చేసినట్లే!
on Nov 29, 2020
'ప్యార్ కా పంచనామా', 'సోను కే టిటు కి స్వీటీ' వంటి అభిమానులను అలరించిన సినిమాల తరువాత, సన్నీ సింగ్ పూర్తిగా భిన్నమైన అవతారంలో కనిపించనున్నాడు. శ్రీరామునిగా ప్రభాస్ నటించనున్న 'ఆదిపురుష్' చిత్రంలో అతను లక్ష్మణుని పాత్రను పోషించనున్నాడు. రామాయణం అంటే సీతారామలక్ష్మణుల కథేనని అందరికీ తెలుసు. ఎప్పుడూ అన్నను అంటిపెట్టుకొని, ఆయన అవసరాలను తీరుస్తూ, కంటికి రెప్పలా కాపాలా కాచే తమ్మునిగా లక్ష్మణుడు భారతీయులందరి మనసుల్లో నిలిచివున్నాడు. అలాంటి కీలక పాత్రకు సన్నీ సింగ్ ఎంపిక కావడం ఆశ్చర్యకరమే. ప్రభాస్తో తెర పంచుకొనే అవకాశం రావడంతో డైరెక్టర్ ఓం రౌత్ సంప్రదించిన వెంటనే ఆ పాత్ర చేయడానికి అతను అంగీకరించినట్లు సమాచారం.
ప్రభాస్ ప్రస్తుతం 'రాధే శ్యామ్' మూవీని చక చకా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ వెంటనే 'ఆదిపురుష్' షూటింగ్ జనవరిలో స్టార్ట్ చెయ్యాలని డైరెక్టర్ ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే ప్రధాన పాత్రధారుల ఎంపికను ఓం రౌత్ వేగంగా కానిస్తున్నాడు. ఇప్పటికే అధికారికంగా లంకేష్ (రావణుడు) పాత్రకు సైఫ్ అలీఖాన్ను తీసుకున్నట్లు వారు ప్రకటించారు. ఇంతకు ముందే రామాయణ కథానాయిక సీత పాత్రకు కృతి సనన్ ఎంపికైనట్లు ప్రచారంలోకి వచ్చిన మాట తెలిసిందే. 'ఆదిపురుష్'ను భారీ బడ్జెట్తో 3డిలో చిత్రీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Also Read