ENGLISH | TELUGU  

పరుచూరి బ్రదర్స్ ఇద్దరినీ ఊచకోత కోస్తా!

on Jan 3, 2018


‘పరుచూరి బ్రదర్స్ ఇద్దరినీ ఉచకోత కోస్తా... ’  ఈ మాట అన్నది ఎవరో కాదు.. నటభూషణ శోభన్ బాబు. అవును.. నిజంగానే... పరుచూరి వారిని అంతమాటా అన్నారు శోభన్. ఆయనకు అంత కోపం తెప్పించే పని వారిద్దరూ ఏం చేశారు?  సాధారణంగా ఎంతో సాత్వికుడు... మృదు స్వభావి అయిన శోభన్..  ఒకేసారి అంతమాట ఎందుకనాల్సి వచ్చింది? తెలుసుకోవాలనుకుంటున్నారా? సరే... విషయంలోకెళ్దాం.

అది 1982వ సంవత్సరం. ఎన్టీయార్ సూపర్ స్టార్ గా మంచి ఊపుమీదున్న రోజులవి. ఆ సమయంలోనే... తారకరాముని కోసం ఓ స్క్రిప్ట్ ని తయారు చేశారు పరుచూరి సోదరులు. కథ కూడా వినిపించారు. ఎన్టీయార్ కథ విని... ‘బావుంది.. చూద్దాం’ అన్నారు. ఆయన నుంచి అలాంటి ఊహించని సమాధానం రావడంతో... పరుచూరి వారు విస్మయానికి లోనయ్యారు. ‘అదేంటి? చేద్దాం.. అనకుండా చూద్దాం అన్నారు’.. ఇదే ఆలోచన పాపం అన్నదమ్ములిద్దరికీ. ఓ రోజు లీజర్ టైమ్ లో ఎన్టీయార్ ని పరుచూరి గోపాలకృష్ణ అడిగారు. ‘అన్నగారూ.. మీరు రాజకీయాల్లోకెళ్లాలని అనుకుంటున్నారా?’ అని. అప్పుడాయన... ‘రాజకీయ నాయకులు నిజాలు చెబుతారా?’ అనడిగాడు. ‘లేదండీ చెప్పరు’ అని సమాధానమిచ్చారు గోపాలకృష్ణ. ‘సో.. నేనూ చెప్పను’ అని వెళ్లిపోయారు. అప్పుడర్థమైంది వారికి.. అన్నగారు ఆ కథ విషయంలో ఎందుకలా స్పందించారో. దాంతో ఆ కథను నిర్మాత తిరుపతి రెడ్డి గారికి వినిపించారు. ఆయనకు కథ బాగా నచ్చి... ’దీన్నే ఇద్దరు హీరోలకు సరిపోయేలా మార్చి రాయండి’ అనడిగారు. నిర్మాత అభీష్టం మేరకు మార్చి బౌండ్  స్క్రిప్ట్ ని నిర్మాతకు అందించారు. ఆయన దగ్గర రెడీగా కృష్ణ, శోభన్ బాబుల డేట్స్ ఉండటంతో ఎ.కోదండరామిరెడ్డిని దర్శకునిగా తీసుకొని ఆ కథను వారిద్దరితో తీసేశాడు.

సినిమా చాలా బాగా వచ్చింది. అయితే... ఆ సినిమా సెన్సార్ టైమ్ లో అనుకోని సంఘటన ఎదురైంది. అదేంటంటే.. కథ రిత్యా.. కృష్ణ, శోభన్ బాబు పాత్రలు సమానంగానే ఉంటాయ్. ఇందులో కృష్ణ విప్లవకారుడు కాగా, శోభన్ మిలటరీ ఆఫీసర్. ఈ సినిమా సెన్సార్ సమయంలో... ఓ మిలటరీ ఆఫీసర్ కూడా సెన్సార్ సభ్యులతో కూర్చున్నాడు. శోభన్ పై తీసిన కొన్ని సన్నివేశాలపై ఆయన అభ్యంతరం లేవనెత్తడంతో... ఆయన పాత్ర నిడివివి కొంత భాగం కత్తిరించడం జరిగింది. దాంతో.. కృష్ణ పాత్ర ప్రధానంగా సినిమా జనాలముందు కొచ్చింది. తీరా సినిమా చూసుకున్న శోభన్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ‘చెప్పిందొకటి.. తీసిందొకటి.. ఇంత అవమానమా? ఆ పరుచూరి బ్రదర్స్ కనిపిస్తే.. ఊచకోత కోస్తా’ అంటూ ఉగ్రరూపాన్ని దాల్చారు. అయితే... తర్వాత అసలు విషయం తెలిసి... నిర్మాతకూ, పరుచూరి వారికి కూడా ఆయన క్షమాపణ చెప్పారు.


శోభన్ బాబు... హీరోగా రిటైర్ అయ్యే సమయంలో పరుచూరి బ్రదర్స్ దర్శకత్వంలోనే ‘సర్పయాగం’ సినిమా చేసిన విషయం తెలిసిందే.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.