శర్వానంద్ @ పరాజయాల పర్వం!
on Oct 16, 2021
వైవిధ్యభరితమైన చిత్రాలకు చిరునామాగా నిలిచే కథానాయకుల్లో శర్వానంద్ ఒకరు. `వెన్నెల`, `అమ్మ చెప్పింది`, `గమ్యం`, `ప్రస్థానం`, `జర్నీ`, `మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు`, `శతమానం భవతి`.. ఇలా జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాల్లో, పాత్రల్లో అలరించిన వైనం శర్వానంద్ సొంతం. అయితే, ఈ మధ్య ఎంచుకునే కథల విషయంలోనూ, పాత్రల పరంగానూ తడబాటుకి గురవుతున్నాడు ఈ యంగ్ హీరో. పర్యావసానమే.. ఐదు అనూహ్య పరాజయాలు.
`శతమానం భవతి` తరువాత వచ్చిన `రాధ` డిజాస్టర్ కాగా.. `మహానుభావుడు` ఓకే అనిపించుకుంది. ఆ తరువాత మాత్రం `పడి పడి లేచే మనసు`, `రణరంగం`, `జాను`, `శ్రీకారం`, తాజాగా `మహాసముద్రం`.. ఇలా వరుసగా ఐదు అపజయాలు దక్కాయి. వీటిలో `జాను` రీమేక్ కాగా.. మిగిలినవన్నీ స్ట్రయిట్ పిక్చర్సే. ఇక `శ్రీకారం`కి టాక్ బాగున్నా.. బాక్సాఫీస్ ని మెప్పించలేకపోయింది. మిగిలిన చిత్రాలు అటు టాక్ పరంగానూ, ఇటు కలెక్షన్ల పరంగానూ ఇంప్రెస్ చేయలేకపోయాయి. ఈ నేపథ్యంలో.. రాబోయే చిత్రాలైన `ఒకే ఒక జీవితం`, `ఆడవాళ్ళు మీకు జోహార్లు` పైనే ఆశలు పెట్టుకున్నాడు పరాజయాల పర్వంలో ఉన్న టాలెంటెడ్ హీరో శర్వానంద్. మరి.. ఈ చిత్రాలైనా శర్వానంద్ ని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువస్తాయేమో చూడాలి.