ఫ్లాష్ బ్యాక్: దర్శక దిగ్గజం కేవీరెడ్డి పైనే సవాల్ విసిరిన సావిత్రి
on Jul 28, 2017
‘మాయాబజార్’సినిమా షూటింగ్ జరుగుతోంది. సావిత్రి లపై కె.వి.రెడ్డి ‘నీ కోసమె నే.. జీవించునది’పాట తీస్తున్నారు. అప్పుడు జరిగిన ఓ సంఘటన... లొకేషన్ మొత్తాన్నీ విస్తుపోయేలా చేసింది. అదేంటో తెలుసుకోవాలనుందా? సరే ఇక చదవండి.
ఆ సమయంలో ఎందుకో... కెమెరామెన్ మార్కస్ భట్లే, సావిత్రి పెద్దగా పలుక్కోవడం లేదు. ఎలాగైనా సావిత్రికి బుద్ధి చెప్పాలనే కసిమీదున్నారు భాట్లే. ‘నీ కోసమె నే జీవించునది’పాటను సావిత్రిపై చిత్రీకరిస్తున్న సమయంలో... ఓ క్లిష్టమైన కెమెరా యాంగిల్ ని సెట్ చేశారాయన. సావిత్రి సైడ్ కి తిరిగుంటారు. క్లోజ్ షాట్ అనమాట. మ్యూజిక్ కి తగ్గట్టుగా మూడు కన్నీటి బొట్లు నేలరాలాలి. అది కూడా సింగిల్ షాట్ లో పడితేనే డెప్త్. ఈ విషయాన్ని కె.వి.రెడ్డికి కూడా వివరించారు భాట్లే.
అయితే... కె.వి.రెడ్డి మాత్రం ససేమిరా అన్నారు. ‘ఏడవమంటే... ఓకే గానీ... మూడు కన్నీటి చుక్కలు పడాలంటే ఎలాగయ్యా’అన్నారు. ‘సింగిల్ టేక్ లో... అలా పడితేనే డెప్త్. ఏదో పెద్ద మహానటిని అనే ఫీలింగ్ లో ఉంటారుగా కొంతమంది. చేయలేరా’ అని సావిత్రిని ఉద్దేశించి రెచ్చగొట్టేలా మాట్లాడారట భాట్లే.
ఈ లోపు కె.వి.రెడ్డి ఏదో చెప్పబోతుంటే... సావిత్రి అడ్డొచ్చి ‘నేను చేస్తా’ అన్నారట. అంతే కె.వి.రెడ్డి షాక్. ‘అదెలాగమ్మా..?’అని ఆయన నచ్చజెప్పబోతుంటే... ‘మూడు కన్నీటి చుక్కలు కాదు.. మీకు ఎన్ని కన్నీటి చుక్కలు కావాలంటే అన్ని కన్నీటి చుక్కలు పడతాయ్.
చూస్తారా?’అన్నారట సావిత్రి కసిగా. ఒక్కసారి లొకేషన్ మొత్తం వేడెక్కింది. వాతావరణాన్ని ఇంకాస్త వేడెక్కిస్తూ... ‘నేను గెలిస్తే... మీ తర్వాతి సినిమాలో కూడా హీరోయిన్ గా నన్నే తీసుకోవాలి.. ఓకే నా?’అని కేవీరెడ్డి ముందు పందెం విసిరారట సావిత్రి. దాన్ని పొగరు అనాలో లేక ఆత్మవిశ్వాసం అనాలో అక్కడ ఎవరికీ అర్థం కాలేదు.
కె.వి.రెడ్డికి కోపం నషాళానికి అంటింది. ఇప్పుడు ఒక్క మార్కస్ భాట్లే మాత్రమే కాదు. కేవీరెడ్డి కూడా సావిత్రికి ఎగనెస్టే. ఆ మాటకొస్తే లొకేషనంతా ఆమెకు వ్యతిరేకంగానే ఉంది. ఏం పొడిచేస్తుందో చూద్దాం అన్నట్లు అందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు.
‘సైలెంట్... రోలింగ్.. యాక్షన్’ అని కేవీరెడ్డి కేక పెట్టగానే... నగారాలో పాట మొదలైంది... సావిత్రి శశిరేఖలా మారిపోయారు. క్లోజ్ షాట్... మ్యూజిక్ కి తగ్గట్టుగా... టక్... టక్... టక్.. మని సరిగ్గా మూడంటే మూడు కన్నీటి చుక్కలు అలా నేలరాలాయి... వితౌట్ గ్లిజరిన్.
అంతే.. లొకేషనంతా విస్తుపోయింది. చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం నుంచి కరతాళ ధ్వనులు మొదలయ్యాయి. చప్పట్లు కొట్టడం మొదలు పెట్టిన తొలి వ్యక్తి మార్కస్ భాట్లే. ఆనందం ఆపోకోలేకపోయాడాయన. ‘ఎక్స్ లెంట్ సావిత్రి... ఎక్స్ లెంట్’ అంటూ... పరుగన
వచ్చి సావిత్రి చేతులను తన నుదుటకు ఆనించుకొని భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక కేవీరెడ్డి అయితే... ఆ మహానటి విశ్వరూపాన్ని చూసి పులకించి పోయి. ‘నువ్వు తెలుగు తెరకు దొరికిన రత్నానివమ్మా..’... అంటూ సావిత్రిని అభినందనలతో ముంచెత్తారు. లొకేషన్లో ఉన్నవారంతా... సావిత్రికి జేజేలు పలికారు. దటీజ్ సావిత్రి.
ఆ విధంగా తన నటనతో ప్రతికూల వాతావరణాన్ని కూడా అనుకూలంగా మార్చేసుకున్నారు సావిత్రి. అందుకే ఆమె మహానటి.
- నరసింహ బుర్రా