ఆ పాటలకు కోటీ వీక్షణల కిరీటం
on Jul 21, 2017
కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన సత్యసాగర్కి సంగీత దర్శకుడిగా రాణించాలన్నది కల..ఏం చేసైనా, ఎలాగైనా తెర మీద తన పేరు చూసుకోవాలని..ఆటోగ్రాఫ్స్ కోసం అభిమానులు క్యూకట్టాలని..ఎక్కడికి వెళ్లినా..జననీరాజనాలు పట్టాలని కలలగన్నాడు.. కానీ తెలుగు వెండితెరపై వెలగాలంటే..ఇంకెంతగా శ్రమించాలో..ఎంతటి మనోక్షోభను అనుభవించాలో ఆ కుర్రాడికి తెలియదు..తెలిసిందల్లా తన కలను నిజం చేసుకోవాలనే..కానీ ఎక్కడికి వెళ్లాలో...ఎవరినీ కలవాలో తెలియని అయోమయంలో హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో వీఎఫ్ఎక్స్లో ఉద్యోగానికి చేరాడు. ఒక పక్క పని చేస్తూనే..అవకాశాల కోసం ప్రయత్నించాడు.
ఈ సమయంలో స్నేహితుని ద్వారా ప్రముఖ నేపథ్య గాయకుడు హేమచంద్రను కలిసి తాను రాసిన పాటలు చూపించాడు..అవి ఆయనకు నచ్చడంతో వాటికి ట్యూన్ కట్టూ నేనే పాడతానని ప్రొత్సహించారు హేమచంద్ర.. మెగాస్టార్ రీఎంట్రీ ఇస్తున్న సందర్భంపై అభిమానులు ఎలా వేచి చూస్తున్నారో తెలిపేలా సత్యసాగర్ అద్భుతమైన పాట రాసి స్వరాలు సమకూర్చారు. "జై చిరంజీవా రావా"...అనే పల్లవితో మొదలయ్యే ఆ పాటను హేమచంద్ర ఆలపించారు. సరే పాట రాశాడు, స్వరపరిచాడు..హేమచంద్రతో పాడించాడు అంతా బాగానే ఉంది..కానీ తన గురించి ప్రపంచానికి తెలియాలి కదా..? ఏం చేయాలి..పడిన కష్టమంతా వ్యర్థమైపోతుంది అనుకుంటున్న సమయంలో ప్రతిభ ఉన్న వారి వెన్నంటి నడిచే తెలుగువన్ గురించి సత్యసాగర్కు తెలిసింది. వెంటనే ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కంఠమనేని రవిశంకర్ను కలిసి తన పరిస్థితిని వివరించారు..యంగ్ టాలెంట్ను ప్రొత్సహించడంలో ముందుండే ఆయన తెలుగువన్ యూట్యూబ్ ఛానెల్లో హేమచంద్ర పాడిన " జై చిరంజీవా" పాటను పెట్టడానికి అంగీకరించారు.
మెగాస్టార్ రాకకోసం వెయికళ్లతో ఎదురుచూస్తోన్న అభిమానులు సత్యసాగర్ పాటకు బ్రహ్మరథం పట్టారు. ఆ పాటను కేవలం వారం రోజుల్లోనే 10 లక్షల మంది వీక్షించారు. ఆ విజయం ఇచ్చిన కిక్తో సత్యసాగర్ను మరింతగా ప్రొత్సహించారు రవిశంకర్. మెగాస్టార్ ఖైదీ నెం.150 సందర్భంగా అభిమానుల కోరిక మేరకు "నీతో ఉంటుంటే" అని స్వయంగా రాసి స్వరపరచిన పాటకు 26 లక్షలు, జనసేన పార్టీ కోసం రాసిన పాటకు 4.5 లక్షలు, పవర్స్టార్ పవన్కళ్యాణ్ కాటమరాయుడు మూవీ సందర్భంగా రాసిన టైటిల్ సాంగ్కు 2 లక్షల మంది, "ఎందాక ఈ పయనం" అంటూ పవన్, శృతీలపై రాసిన పాటకు 22 లక్షలు, హ్యపీ న్యూఇయర్ పాటకు 15 లక్షలు, పవన్, త్రివిక్రమ్ సినిమా కోసం అభిమానుల విజ్ఞప్తి మేరకు రాసిన పాటకు 8 లక్షల వ్యూస్ వచ్చాయి..అలా తెలుగువన్లో రాసిన అన్ని పాటలకు గానూ కోటి వ్యూస్ సాధించి అతి తక్కువ సమయంలో ఈ ఘనతను అందుకుని రికార్డు సృష్టించాడు..
ఈ విజయం తన ఒక్కరి వల్ల సాధ్యమవ్వలేదని ఈ ప్రయాణంలో తాను రుణ పడి ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారని నాలో ఉన్న ప్రతిభను గుర్తించి హేమచంద్ర గారికి నన్ను పరిచయం చేసిన వినయ్..నన్ను నమ్మి నాకు తన స్వరాన్నిచ్చిన హేమచంద్రగారు..ప్రపంచానికి నా పాటను పరిచయం చేసిన కంఠమనేని రవిశంకర్ గారు. పాటలు రాయడంలోనూ, వాటిని స్వరపరచడం లోను అండగా నిలిచిన నిరు..ఇలా ప్రతీ అడుగులో నాకు సహకరించిన వారందరికి ఈ విజయాన్ని అంకితమిస్తున్నానన్నారు సత్యసాగర్. కృషి, పట్టుదల, దీక్ష ఉంటే దేన్నైనా సాధించవచ్చని సత్యసాగర్ నిరూపించారు. సంగీత దర్శకుడు కావాలన్న ఆయన కల అతి త్వరలో సాకారం కావాలని మనస్పూర్తిగా కోరుకుందాం.