ఫస్ట్ మెగా ప్రిన్స్.. నెక్స్ట్ సూపర్ స్టార్..?
on Jun 6, 2020
‘భరత్ అనే నేను’(2018), ‘మహర్షి’(2019), ‘సరిలేరు నీకెవ్వరు’(2020).. ఇలా ఏడాదికో ఘనవిజయంతో సక్సెస్ఫుల్గా హ్యాట్రిక్ అంకాన్ని పూర్తి చేశాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. అంతేకాదు.. ఈ మూడు చిత్రాలతోనూ వరుసగా హయ్యెస్ట్ గ్రాసర్స్ అందుకుని.. టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యాడు ఈ ఘట్టమనేని హ్యాండ్సమ్ హీరో. ఒకవైపు ఈ విజయాలను ఆస్వాదిస్తూనే.. మరోవైపు కొత్త చిత్రానికి రంగం సిధ్ధం చేసుకున్నాడు మహేశ్. టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో రూపొందనున్న ఆ చిత్రమే.. ‘సర్కారు వారి పాట’. ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. 2021 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో మహేశ్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరో అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆ మధ్య కీర్తి సురేష్, పూజా హెగ్డే, కియారా అద్వానీ వంటి ప్రముఖ కథానాయికల పేర్లు వెలుగులోకి రాగా.. తాజాగా మరో పేరు వినిపిస్తోంది. ఆ భామ మరెవరో కాదు.. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు మహేశ్ మంజ్రేకర్ తనయ సయీ మంజ్రేకర్. సల్మాన్ ఖాన్ కథానాయకుడుగా నటించిన హిందీ చిత్రం ‘దబాంగ్ 3’తో నాయికగా తొలి అడుగేసిన సయీ.. ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సర్గా రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామాలో హీరోయిన్గా నటిస్తోంది. ఆ సినిమా విడుదలయ్యేలోపే మహేశ్ సరసన నాయికగా నటించే అవకాశం దక్కడం సయీ అదృష్టమనే చెప్పాలి. త్వరలోనే సయీ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
కాగా ‘సర్కారు వారి పాట’ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, జీయంబి ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. యువ సంగీత సంచలనం తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు.