'బిస్కెట్ కింగ్' లైఫ్ ఆధారంగా వెబ్ సిరీస్.. లీడ్ రోల్లో పృథ్వీరాజ్!
on Dec 1, 2021
'బిస్కెట్ కింగ్'గా పేరుపొందిన రాజన్ పిళ్లై జీవితం ఆధారంగా ఒక హిందీ వెబ్ సిరీస్ రూపొందనుంది. ఇందులో ప్రధాన పాత్రను పోషిస్తూ, మూవీని తనే డైరెక్ట్ చేయనున్నాడు మలయాళం స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ ప్రాజెక్టును యోడ్లీ ఫిలిమ్స్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ విషయాన్ని ఒక ట్వీట్ ద్వారా ప్రొడక్షన్ హౌస్ షేర్ చేసింది. "ఇండియాస్ బిస్కెట్ కింగ్గా పేరుపొందిన రాజన్ పిళ్లై జీవిత కథ ఆధారంగా తీసే ఒక హిందీ వెబ్ సిరీస్లో లీడ్ రోల్ను పోషిస్తూ, సిరీస్ను జాతీయ అవార్డు గ్రహీత పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేయనున్నారు" అని ఆ ట్వీట్లో రాసుకొచ్చారు.
ఈ సిరీస్లో పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ను కూడా మేకర్స్ షేర్ చేశారు. ఈ పోస్టర్లో పృథ్వీరాజ్ కళ్లకు గాగుల్స్ పెట్టుకొని, ఒక ప్లేన్ విండో నుంచి బయటకు చూస్తున్నట్లు కనిపిస్తున్నాడు. వృత్తిరీత్యా బిజినెస్మేన్ అయిన రాజన్ పిళ్లై.. బ్రిటానియా ఇండస్ట్రీస్లో షేర్హోల్డర్. 1970ల మధ్యలో సింగపూర్లో నివాసం ఉన్న అతను నబిస్కో, హంట్లీ & పామర్, బ్రిటానియా లాంటి బిస్కెట్ కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేశాడు. 1993లో సింగపూర్ కమర్షియల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ అతడిపై విచారణ చేపట్టింది.
1995 జూలై 4న న్యూఢిల్లీలోని ఫైవ్స్టార్ లీ మెరీడియన్ హోటల్పై దాడిచేసి అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాత అతడిని తీహార్ జైలుకు తరలించారు. వైద్య చికిత్స కోసం పిళ్లై అప్పీలు చేసుకున్నాడు. అయితే అతడి అప్పీలుకు స్పందన రాలేదు. ఆ మరుసటి రోజే లివర్ సిరోసిస్ వ్యాధి లక్షణాలతో కస్టడీలోనే అతను చనిపోయాడు. రాజన్ పిళ్లై తమ్ముడు రాజ్మోహన్ పిళ్లైతో కలిసి కె. గోవిందన్ కుట్టీ రాసిన 'ఎ వేస్టెడ్ డెత్ - ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ రాజన్ పిళ్లై' పుస్తకం 2001లో విడుదలైంది.
పృథ్వీరాజ్ నటించే వెబ్ సిరీస్ ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది. 2022 మధ్యలో షూటింగ్ మొదలు కానున్నది.
Also Read