జక్కన్న హీరోలపై 'కేజీఎఫ్' కెప్టెన్ కన్ను!
on Oct 16, 2021
`కేజీఎఫ్`తో జాతీయ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు పొందారు కన్నడ నిర్దేశకుడు ప్రశాంత్ నీల్. త్వరలో `కేజీఎఫ్` రెండో భాగంతో పలకరించనున్నారాయన. వేసవి కానుకగా 2022 ఏప్రిల్ 14న ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. `ఉగ్రమ్`, `కేజీఎఫ్ః ఛాప్టర్ 1`, `కేజీఎఫ్ః ఛాప్టర్ 2` ఇలా తొలి మూడు సినిమాలను కన్నడ కథానాయకులతోనే తీసిన ప్రశాంత్ నీల్.. రాబోయే సినిమాలను మాత్రం టాలీవుడ్ స్టార్స్ తోనే ప్లాన్ చేస్తుండడం విశేషం. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. దర్శకధీరుడు రాజమౌళి వరుస చిత్రాల కథానాయకులే ప్రశాంత్ రాబోయే చిత్రాలకి లక్ష్యం అవుతున్నారు.
రాజమౌళి ప్రీవియస్ మూవీ `బాహుబలి` సిరీస్ లో హీరో అయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రశాంత్ ఆన్ - గోయింగ్ ప్రాజెక్ట్ `సలార్`లో కథానాయకుడు. అలాగే `సలార్` తరువాత నీల్ చేయనున్న సినిమా విషయానికి వస్తే.. ఇందులో జక్కన్న క్రేజీ మల్టిస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`లోని ఇద్దరు స్టార్స్ లో ఒకరైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో. అంతేకాదు.. `ఆర్ ఆర్ ఆర్`లోని మరో కథానాయకుడు అయిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తోనూ ప్రశాంత్ నీల్ సినిమా చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దసరా రోజున చరణ్, ప్రశాంత్ చేసిన ట్వీట్స్.. ఈ ప్రాజెక్ట్ కి హింట్ ఇస్తున్నాయి కూడా.
మొత్తమ్మీద ప్రభాస్, తారక్, చరణ్.. ఇలా జక్కన్న హీరోలపైనే `కేజీఎఫ్` కెప్టెన్ కన్ను పడిందన్నమాట. మరి.. ఈ ముగ్గురితోనూ ప్రశాంత్ నీల్ తీసే పాన్ - ఇండియా వెంచర్స్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో చూడాలి.