బాబుతో ఎందుకని.. వైఎస్కి నాగ్ నో చెప్పాడా..?
on Jan 4, 2018
ప్రజంట్ బాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాకా ఎక్కడ చూసినా బయోపిక్లదే ట్రెండ్. వాటి సంగతి పక్కనబెట్టి.. మన టాలీవుడ్ విషయానికి వస్తే.. మహానటి సావిత్రి జీవితం ఆధారంగా మహానటి, ఎన్టీఆర్ జీవితం ఆధారంగా మరో సినిమా తెరకెక్కుతూ తెలుగునాట బయోపిక్లు తీయాలనుకునే వారిలో కొత్త ఉత్సాహం తీసుకొస్తున్నాయి. సావిత్రి బయోపిక్ సంగతి అటుంచితే.. ఎన్టీఆర్ ఓ పార్టీ వ్యవస్థాపకులు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఆయన స్థాపించిన పార్టీనే అధికారంలో ఉండటంతో.. అన్నగారి బయోపిక్ రాజకీయ రంగు పులుముకుంది. దీనిని అడ్డుపెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి అంటూ సినీ, రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. దీనికి పర్యవసానమే ఎన్టీఆర్ జీవితంపై ఒకేసారి మూడు సినిమాలు.
సరిగ్గా ఇలాంటి టైంలో మరో మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డిపై సినిమా తీయబోతునన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆనందో బ్రహ్మ ఫేం మహీ రాఘవ దీనిని టేకప్ చేయబోతున్నారని.. మళయాళ సూపర్స్టార్ మమ్ముట్టి ఇందులో వైఎస్ పాత్రలో నటించనున్నారని కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే మమ్ముట్టి కంటే ముందుగానే ఈ కథను కింగ్ నాగార్జునకు వినిపించాడట మహీ. 1999-2004 మధ్యకాలంలో పీసీసీ అధ్యక్షుడిగా, సీఎల్పీ నేతగా ప్రభుత్వంపై వైఎస్ చేసిన పోరాటం.. పాదయాత్రతో కాంగ్రెస్ను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చిన ఘట్టాలను ఇందులో చూపిస్తాను అని నాగ్తో చెప్పాడట మహీ.
అసలే బాలయ్యతో మనస్పర్థల కారణంగా టీడీపీతో గ్యాప్ పెరుగుతున్న టైంలో వైఎస్ బయోపిక్లో నటిస్తే ఇక అంతే సంగతులు అని నాగ్ భయపడ్డాడట. ప్రతిపక్షనేతగా వైఎస్ పోరాటం చేసింది నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద.. సినిమాలో వైఎస్ హీరో అయితే విలన్ ఎవరవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా ఊహించిన నాగ్ సైలెంట్గా స్క్రిప్ట్ డెవలప్ చేసి తీసుకురా అప్పుడు చూద్దాం అన్నాడట. తీరా స్క్రిప్ట్ రెడీ చేసి వెళ్లిన తర్వాత.. తాను ఇప్పుడున్న పరిస్థితుల్లో రిస్క్ చేయలేనని తన లాస్ట్ డిసిషన్ చెప్పేశాడట నాగార్జున. ఇక చేసేది లేక మహీ రాఘవ త్రివేండ్రం వెళ్లడం.. మమ్ముట్టిని కలిసి కథ వినిపించడం.. ఆయన గ్రీన్సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని ఫిలింనగర్ టాక్.