తెలుగు సినిమా ఉన్నంతకాలం ఎన్టీఆర్ ను గుర్తుచేసుకుంటాం!
on Jan 18, 2022
'బంగార్రాజు బ్లాక్ బస్టర్ మీట్' పేరుతో రాజమండ్రిలో తాజాగా సక్సెస్ మీట్ ని నిర్వహించింది 'బంగార్రాజు' మూవీ టీమ్. ఈ కార్యక్రమానికి అతిథులుగా పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తి, వైసీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, వైసీపీ ఎంపీ భరత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"ఇటువంటి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేస్తే చూస్తారా అని ప్రపంచమంతా భయపడింది. నార్త్ ఇండియాలో సినిమాలు రిలీజ్ చేయడం ఆపేశారు. కానీ తెలుగు ప్రేక్షకులు సినిమాని ఆదరించి సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. తెలుగు ప్రేక్షకుల మీద నమ్మకంతో సినిమాని విడుదల చేశాం. ఆ నమ్మకాన్ని నిజం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు" అని నాగార్జున అన్నారు.
"మొన్న నా మిత్రుడు చిరంజీవి గారితో మాట్లాడాను. వైఎస్ జగన్ గారిని కలిసొచ్చారు, ఏం మాట్లాడుకున్నారు అని అడిగాను. సినీ పరిశ్రమకి అంతా మంచే జరుగుతుందని జగన్ గారు చెప్పారని అన్నారు. వైఎస్ జగన్ గారికి థ్యాంక్యూ వెరీ మచ్" అని చెప్పారు.
"ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారు ఫిల్మ్ ఇండస్ట్రీకి రెండు కళ్ళు అని ఎప్పటినుంచో అంటూ ఉంటారు. ఈరోజు ఎన్టీఆర్ గారి వర్ధంతి. తెలుగు సినిమా ఉన్నంతవరకు ఆయనను మనం గుర్తు చేసుకోవాలి.. గుర్తు చేసుకుంటాం. ఎన్టీఆర్ లివ్స్ ఆన్. ఏఎన్నార్ లివ్స్ ఆన్" అంటూ నాగార్జున స్పీచ్ ముగించారు.