నా ప్రాబ్లమ్ విష్ణుతో కాదు.. ఎలక్షన్ ఆఫీసర్తో!
on Oct 18, 2021
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరిగిన తీరుపై తనకు కొన్ని అనుమానాలున్నాయనీ, ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్ పక్షపాతంతో వ్యవహరించారనీ నటుడు ప్రకాశ్రాజ్ ఆరోపించారు. తన సమస్య 'మా' నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుతో కాదనీ, ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్తోనేననీ ఆయన అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అక్టోబర్ 10న ఫిల్మ్నగర్లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో 'మా' ఎలక్షన్స్ జరిగాయి. దీనికి పోలింగ్ ఆఫీసర్గా కృష్ణమోహన్ వ్యవహరించారు. అయితే ఆ రోజు నటులు మోహన్బాబు, నరేశ్ అసాంఘికంగా వ్యవహరించారనీ, తమ ప్యానల్ సభ్యులను దూషించారనీ ప్రకాశ్రాజ్ ఆరోపించారు. తమ అనుమానాలు నివృత్తి కావడం కోసం ఆరోజు ఎన్నికలు జరిగిన ప్రదేశంలో సీసీ టీవీ ఫుటేజ్ అందజేయాలనీ డిమాండ్ చేస్తూ ఎన్నికల ఆఫీసర్కు ఆయన లేఖ రాశారు. అయితే ఇంతవరకూ ఆ సీసీ టీవీ ఫుటేజ్ అందలేదని సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
తను ఇగోతో ఈ డిమాండ్ చేయట్లేదని ప్రకాశ్రాజ్ క్లారిటీ ఇచ్చారు. "ఎన్నికలు జరిగిన తీరుపై అందరికీ అనుమానాలున్నాయి. ఆ అనుమానాలతో బతక్కూడదు. అందులో ఏం లేదనుకోండి.. ఏం లేదనేది తేలిపోతుంది. ఉద్రిక్త వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. మీరెవరూ నమ్మట్లేదు. అనుమానంతోనే ఉన్నారు. అనుమానం క్లియర్ అయిపోతుంది కదా" అని ఆయన అన్నారు.
"బయటి వ్యక్తులు చాలామంది వచ్చారు. నేను కూడా ఆ సీసీ టీవీ ఫుటేజ్ చూశాకే ఏమైనా చెప్పగలను. నేను రాసిన లెటర్కు కృష్ణమోహన్ రిప్లై ఇవ్వలేదు. ఆయన పక్షపాతంతో ఉన్నారనేదే మా బాధ. నేనొక లెటర్ రాస్తే ఆయన మీడియాకు వెళ్లిపోతాడు. విష్ణుగారు పెద్దమనసుతో 'చూసుకోండి' అంటున్నారు. ఎలక్షన్ ఆఫీసరేమో 'అలా కాదు, దానికో ప్రొసీజర్ ఉంది, కోర్టు' అంటున్నారు. ఎందుకు ఆయన దాక్కుంటున్నారు? నా ప్రాబ్లెమ్ కృష్ణమోహన్తోటి.. మంచు విష్ణుతో కాదు" అని అన్నారు ప్రకాశ్రాజ్.
Also Read