స్పెషల్ స్టోరీ: అసామాన్య సంగీత 'మరకతమణి' కీరవాణి!
on Jul 4, 2020
టాలీవుడ్ టాప్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి నేడు 59వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. చక్రవర్తి అనంతరం ఆ స్థాయి సంగీత దర్శకుడిగా కీరవాణి పాపులర్ అయ్యారు. వినసొంపైన బాణీలు అల్లి కోట్లాదిమంది సంగీత ప్రియుల హృదయాలను ఆయన గెలుచుకున్నారు. కె. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయగా అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషించిన 'అన్నమయ్య' చిత్రానికి సమకూర్చిన సంగీతానికి గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు కీరవాణి. మృదు మధురమైన మెలోడీ అయినా, ఫాస్ట్ బీట్ సాంగ్ అయినా అత్యుత్తమ స్థాయి బాణీలు అందించగల నేటి సంగీత దర్శకుల్లో దేశంలోనే ఆయన అగ్రగణ్యుడు. తను సమకూర్చిన సంగీతానికి గాను బెస్ట్ మ్యూజిక్ కంపోజర్గా ఆయన ఎనిమిది ఫిల్మ్ఫేర్ అవార్డులు, పదకొండు నంది అవార్డులు, ఒక తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. 'బాహుబలి' సినిమాకి అందించిన సంగీతంతో అంతర్జాతీయంగానూ సంగీత దర్శకుడిగా ఆయన పేరు మారుమోగింది. దేశంలో ఆల్టైమ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ల లిస్ట్ తయారుచేస్తే ఆయన పేరు ముందు వరుసలోనే ఉంటుందనడంలో సందేహం లేదు.
కీరవాణి సంగీత స్వరాలు కూర్చిన చిత్రాలలో 'అన్నమయ్య'కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇటు అన్నమాచార్య కీర్తనలకు, అటు వేటూరి, జె.కె. భారవి రాసిన పాటలకు అత్యద్భుతమనదగ్గ రీతిలో ఆయన బాణీలు సమకూర్చారు. కీర్తనలు, పాటలు కలిసి ఆ సినిమాలో 20 ఉన్నాయి. అంటే వాటితోనే ఆ సినిమా కథ నడుస్తుందని చెప్పాలి. అందుకే కీరవాణికి ఈ సినిమా నేషనల్ అవార్డ్ తీసుకొచ్చింది.
నిజానికి రాఘవేంద్రరావు, కీరవాణి మధ్య వృత్తిగత బంధం గొప్పదని చెప్పాలి. దర్శకేంద్రుడు తీసిన సుందరకాండ, పెళ్లిసందడి, మేజర్ చంద్రకాంత్, ఘరానా మొగుడు, శ్రీరామదాసు, అల్లరి మొగుడు, అల్లరి ప్రియుడు, బొంబాయి ప్రియుడు వంటి చిత్రాలు మ్యూజికల్గా ఎంత పెద్ద హిట్టయ్యాయో మనకు తెలుసు. 'పెళ్లి సందడి'లో కీరవాణి బాణీలు సమకూర్చిన పాటలన్నీ రసగుళికలే. ఆ సినిమా సిల్వర్ జూబ్లీ చేసుకున్నదంటే అందులో సంగీతం పాత్ర చాలానే ఉంది. ఆ సినిమాకి కీరవాణి నంది అవార్డు అందుకున్నారు కూడా.
రాఘవేంద్రరావు తర్వాత కీరవాణికి అంతటి హిట్ కాంబినేషన్ రాజమౌళితో సమకూడింది. పెద్దన్న సంగీతం లేకుండా రాజమౌళి సినిమాయే లేదన్నంతగా వాళ్ల మధ్య బంధం పెనవేసుకుపోయింది. రాజమౌళి తొలిచిత్రం 'స్టూడెంట్ నెం.1' నుంచి 'బాహుబలి 2' దాకా వాళ్ల కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా పాటలు సంగీత ప్రియులను అమితంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రామ్చరణ్ హీరోగా నటించిన 'మగధీరస, సమంత నాయికగా నటించిన 'ఈగ', ప్రభాస్ టైటిల్ రోల్ చేసిన 'బాహుబలి' సినిమాలకు కీరవాణి కూర్చిన బాణీలు అపూర్వం. 'మగధీర'కు ఫిల్మ్ఫేర్ అవార్డ్, 'ఈగ', 'బాహుబలి' చిత్రాలకు నంది అవార్డ్ అందుకున్నారు కీరవాణి.
ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' మూవీకి ఆయన బాణీలు సమకూరుస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమా కీరవాణి సంగీత సామర్థ్యానికి మరో ఉదాహరణగా నిలిచే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఇది పీరియడ్ ఫిల్మ్. 20వ శతాబ్దం తొలినాళ్ల నేపథ్యంలో నడిచే సినిమా కావడంతో అప్పటి కాలానికి తగ్గ బీజీయం అందించడంతో పాటు, క్లాసిక్ ట్యూన్స్ అందించాల్సిన బాధ్యత కీరవాణి పైనుంది. అంటే.. ఈ సినిమా సంగీతం ఆయనకో సవాలు. ఎదురైన ప్రతి సవాలునూ తనకే సాధ్యమైన రీతిలో అధిగమిస్తూ, ఎప్పటికప్పుడు తన బాణీల మాధుర్యాన్ని పంచుతూ వస్తోన్న ఆయన 'ఆర్ఆర్ఆర్'తో కచ్చితంగా మ్యాజిక్ చేస్తాడని ఆశించవచ్చు. అలాగే పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న సినిమాకీ బాణీలు అందిస్తున్నారు కీరవాణి. నవతరానికి సిసలైన మార్గదర్శిగా, తెలుగు సినిమా గర్వించదగ్గ సంగీతకారుల్లో ఒకరిగా పేరుపొందిన ఆయనకు.. జన్మదిన శుభాకాంక్షలు.
- బుద్ధి యజ్ఞమూర్తి