బాలకృష్ణను కలిసిన విష్ణు, మోహన్ బాబు.. త్వరలోనే చిరంజీవిని కూడా కలుస్తా!
on Oct 14, 2021
ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో అధ్యక్షుడుగా గెలిచిన మంచు విష్ణు తాజాగా నందమూరి బాలకృష్ణను కలిశారు. విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి బాలకృష్ణను ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రస్తుతం 'మా'లో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది.
అనంతరం విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. తనకు మద్దతుగా నిలిచిన బాలకృష్ణను కలిసి ఆశీర్వాదం తీసుకున్నానని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఆయన తనకు మొదటి నుంచి సపోర్ట్ చేశారని అన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్దలందర్నీ తాను కలుస్తానని, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని తెలిపారు. త్వరలోనే చిరంజీవిని కూడా కలుస్తానని చెప్పారు. ఈ నెల 16న ఎన్నికల అధికారి తన ప్యానల్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని పేర్కొన్నారు.
బాలకృష్ణను కలిసిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా కూడా తెలియజేశారు విష్ణు. "ఎన్నికల్లో మద్దతుగా నిలిచినందుకు బాల అన్నకు ధన్యవాదాలు. ఆయన్ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశాను. 'మా' కోసం ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. 'మా' కుటుంబాన్ని ఒక్కటిగా చేసే అంశంపై ఫోకస్ పెట్టమని నాకు సలహా ఇచ్చారు. ఇదే ప్రస్తుతం నా ఎజెండా" అని ట్వీట్ చేసిన విష్ణు.. బాలకృష్ణతో దిగిన ఫొటోస్ షేర్ చేశారు.
బాలకృష్ణతో భేటి అనంతరం మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. బాలకృష్ణ గొప్ప సంస్కారం ఉన్న మనిషి అంటూ ప్రశంసలు కురిపించారు. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను బాలకృష్ణ అల్లుడు(నారా లోకేష్)కి వ్యతిరేకంగా మంగళగిరిలో వైసీపీ తరఫున ప్రచారం చేశానని.. కానీ అదేమీ మనసులో పెట్టుకోకుండా మా ఎన్నికల్లో విష్ణుకి బాలకృష్ణ మద్దతు ఇచ్చారని మోహన్ బాబు అన్నారు.
Also Read