కంగన సవాల్.. ఏ గొడవనైనా నేను స్టార్ట్ చేశానని ప్రూవ్ చేస్తే ట్విట్టర్ని వదిలేస్తా!
on Sep 18, 2020
ఆన్లైన్ ఫైటింగ్లు, ఆఫ్-లైన్ కాంట్రవర్సీలతో కంగనా రనౌత్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. సుశాంత్సింగ్ రాజ్పుత్ మృతి తర్వాత ఆమె ఇతరులతో చేసే మాటల యుద్ధాలు మరింత ముదిరాయి. ప్రధానంగా కరణ్ జోహార్ను టార్గెట్ చేసుకొని ఆన్లైన్లో అతనిపై విమర్శల యుద్ధాన్ని కొనసాగించిన ఆమె, తర్వాత మహారాష్ట్ర పాలక పార్టీ శివసేన పైనా, తన ఆఫీస్ను కూలగొట్టిన బీఎంసీపైనా ఏ రీతిన పోరాటాన్ని కొనసాగిస్తూ వస్తుందో చూస్తున్నాం. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్లా ఉందని వ్యాఖ్యానించడానికి కూడా ఆమె వెనుదీయలేదు. రీసెంట్గా తనను విమర్శించిన ఊర్మిళా మతోంద్కర్ 'సాఫ్ట్ పోర్న్ యాక్ట్రెస్'గా అభివర్ణించి మరింత అగ్నిని రగిల్చింది కంగన.
ఇప్పుడు తన స్టేట్మెంట్లను సమర్ధించుకుంటూ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తానెప్పుడూ ఎవరి మీదా యుద్ధాన్ని మొదలు పెట్టలేదనీ, కానీ ఎప్పుడూ యుద్ధాన్ని తానే ముగిస్తూ వస్తున్నాననీ రాసుకొచ్చింది. ఎవరైనా అది తప్పని నిరూపిస్తే ట్విట్టర్ను వదిలేస్తానని కూడా ఆమె ఛాలెంజ్ చేసింది.
"నేను జగడాలమారినని చాలామంది అంటుంటారు. కానీ అది నిజం కాదు. ఎప్పడూ ఏ గొడవనీ మొదలు పెట్టని రికార్డ్ నాది. అది తప్పని ఎవరైనా నిరూపించగలిగితే ట్విట్టర్ను వదిలేస్తాను. నేనెప్పుడూ ఫైట్ను మొదలుపెట్టలేదు కానీ ప్రతి ఫైట్నూ నేను ముగిస్తాను. 'ఎవరైనా యుద్ధం చేయమని నిన్ను అడిగితే, వాళ్లను తిరస్కరించవద్దు' అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు" అని ట్వీట్ చేసింది కంగన.
ఇప్పుడు నెటిజన్లు ఆమె ఎవరితోనైనా గొడవను మొదలు పెట్టిందా, లేదా అనే పరిశోధనలో మునిగిపోయారు. చూద్దాం.. కంగన చెప్పింది రైటో, రాంగో...
Also Read