లేకపోతే నాకు నేనే బోర్ కొట్టేస్తా!
on Dec 25, 2019
సత్యరాజ్, సాయితేజ్లను తాతామనవళ్లుగా చూపిస్తూ, వాళ్ల మధ్య బంధాన్ని చక్కగా ఆవిష్కరించిన 'ప్రతిరోజూ పండగే' సినిమా సక్సెస్ఫుల్గా థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. సినిమా సక్సెస్ అయినప్పుడల్లా తనపై బాధ్యత మరింత పెరుగుతుందని అంటున్న ఆయన ఈసారి పూర్తి స్థాయి లవ్ స్టోరీ తీస్తానని చెబుతున్నాడు. "ఏ సినిమాకైనా ఇవాళో టాక్, రేపో టాక్ ఉండదు. ఎప్పుడైనా నూన్ షో అయ్యాక ఒకటే టాక్ వస్తుంది. సినిమా బావుంది, బాలేదు.. అని. దీంట్లో యావరేజ్, ఎబోవ్ యావరేజ్, హిట్, సూపర్ హిట్, బ్లాక్బస్టర్ అనేది కలెక్షన్ను బట్టి ఇండస్ట్రీలో మనం వాటిని పరిగణిస్తుంటాం. ఇలా ఇండస్ట్రీలో సినిమాని డబ్బులతో కొలుస్తుంటారు. బాగోలేదన్న సినిమాకి జనం వెళ్లరు, బాగుందన్న సినిమాకి వెళ్తారు. జనం చూస్తున్నారంటే, ఆ సినిమా బాగున్నట్లే లెక్క. దాని గురించి ఇంక డిస్కషనే లేదు" అని చెప్పాడు మారుతి.
ప్రతి సినిమా సక్సెస్ అవడానికే చేస్తుంటామనీ, అలా అని మళ్లీ ఒక ఎమోషనల్ సినిమా కావాలని తీసి తన మీద ఆ రకమైన ముంద్రేసుకోవడం ఇష్టం ఉండదనీ ఆయన అంటున్నాడు. "ఎప్పుడూ జానర్ మార్చుకుంటూ వెళ్లడమే నాకిష్టం. 'ఈరోజుల్లో', 'బస్టాప్' తీసేటప్పుడు.. ఇలాంటి సినిమాలే తీస్తాడనే ముద్ర పడింది. దాంతో జానర్ మార్చి 'ప్రేమకథా చిత్రం' తీశాను. హారరే తీస్తాడనుకుంటే, మళ్లీ అదికాదని 'భలే భలే మగాడివోయ్' తీశాను. అదే జానర్లో 'మహానుభావుడు' తీసినప్పుడు అలాంటివే తీస్తున్నానని జనం అనుకుంటున్నారని, ఒక ఫ్యామిలీ సినిమా తీద్దామనే ఉద్దేశంతో 'ప్రతిరోజూ పండగే' తీశాను. అంటే నన్ను నేను శోధించుకొని సినిమాలు తీస్తుంటాను. ఈసారి కూడా నేను ఫ్యామిలీ సినిమానే తీస్తే, 'వీడు ఫ్యామిలీలైతేనే తీస్తాడు' అని ముద్రేస్తారు. అందుకని తర్వాత ఒక మంచి ఔట్ అండ్ ఔట్ లవ్ స్టోరీ తీద్దామనుకుంటున్నా. లేకపోతే నాకు నేనే బోర్ కొట్టేస్తా" అని తెలిపాడు మారుతి.