అఫీషియల్.. 'హరి హర వీరమల్లు'కి కొత్త దర్శకుడు!
on May 2, 2024
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu) నుంచి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తప్పుకోనున్నారని, ఆయన స్థానంలో మరొకరు ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయనున్నారని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ దర్శకులలో క్రిష్ ఒకరు. అలాంటి ఆయన తన ప్రైమ్ టైంలో 'హరి హర వీరమల్లు' కోసం ఏకంగా మూడేళ్లకు పైగా కేటాయించారు. అయినప్పటికీ ఇంకా సినిమా పూర్తి కాలేదు. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అవ్వడం మరియు ఇతర కారణాల వల్ల.. ఎప్పుడో మొదలైన ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందడి మొదలైంది. పవన్ ఎమ్మెల్యేగా గెలిచి, ఏపీ పాలిటిక్స్ లో కీలకంగా మారి, మరింత బిజీ అయ్యే అవకాశముంది. అదే జరిగితే 'హరి హర వీరమల్లు' మరింత ఆలస్యమవుతుంది. అందుకే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తన ఇతర కమిట్ మెంట్స్ ని పూర్తి చేయాలని క్రిష్ నిర్ణయించుకున్నాడట. క్రిష్ స్థానంలో మరో కొత్త దర్శకుడు మిగతా చిత్రాన్ని పూర్తి చేయనున్నాడు.
తాజాగా 'హరి హర వీరమల్లు' టీజర్ విడుదలైంది. టీజర్ విడుదల సందర్భంగా నిర్మాతలు కీలక ప్రకటన చేశారు. క్రిష్ పర్యవేక్షణలో నిర్మాత ఎ.ఎం. రత్నం కుమారుడు, దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ చిత్రం యొక్క మిగిలిన షూటింగ్ ను, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. జ్యోతి కృష్ణ "ఎనక్కు 20 ఉనక్కు 18", "నీ మనసు నాకు తెలుసు", "ఆక్సిజన్" వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అలాగే "నట్పుక్కాగ", "పడయప్ప" వంటి తమిళ బ్లాక్ బస్టర్ చిత్రాలకు రచయితగా పని చేశాడు.
Also Read