సుజీత్ చేతిలో మెగాస్టార్ 'లూసిఫర్'
on Apr 10, 2020
అవును... యువ దర్శకుడు, 'సాహో' ఫేమ్ సుజీత్ కి మెగాస్టార్ చిరంజీవిని దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. 'లూసిఫర్' రీమేక్ చేసే అవకాశం దాదాపుగా అతడికి దక్కినట్టే. ఎందుకంటే... రీమేక్ స్క్రిప్ట్ బాధ్యతలు చిరంజీవి అతడికి అప్పగించారు. ఈ సంగతి ఆయనే స్వయంగా చెప్పారు. "అవును... 'లూసిఫర్' తెలుగు రీమేక్ స్క్రిప్ట్ మీద వర్క్ చేయమని నేను సుజీత్ కి చెప్పా. కరోనా వైరస్ రావడం, లాక్ డౌన్ విధించడంతో ఇండస్ట్రీ షట్ డౌన్ అయింది" అని చిరంజీవి స్పష్టం చేశారు.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 'ఆచార్య' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అది పూర్తయిన తర్వాత 'లూసిఫర్' రీమేక్ చేయనున్నారు. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఆ సినిమా రీమేక్ రైట్స్ ఆయన కొన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సుజీత్ ని దర్శకుడిగా ఎంచుకోవడమే చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే... దర్శకుడిగా సుజీత్ అనుభవం రెండు సినిమాలు మాత్రమే. మొదటి సినిమా 'రన్ రాజా రన్' సూపర్ హిట్. రెండో సినిమా 'సాహో' అంచనాలు అందుకోలేదు. అయినా... అతడిపై మెగాస్టార్ నమ్మకం ఉంచారు.