దూకుడు మీదున్న అల్లు అర్జున్..!
on May 7, 2016
సరైనోడుతో సరైన హిట్ కొట్టిన అల్లు అర్జున్ వరసగా మాస్ సినిమాలు కమిట్ అవుతూ దూకుడు మీదున్నాడు. ఇన్నాళ్లూ యూత్ ఫుల్ సినిమాలు చేస్తూ వచ్చిన బన్నీ, సరైనోడుతో పూర్తి స్థాయి మాస్ హీరో ఛేంజోవర్ కోసం ట్రై చేసి సక్సెస్ అయ్యాడు. అయితే తన స్పీడు ఇక్కడితో ఆగదంటున్నాడు బన్నీ. పందెంకోడి, ఆవారా, రన్ లాంటి స్టైలిష్ మాస్ ఎంటర్ టైనర్ లు తెరకెక్కించిన లింగుస్వామితో బన్నీ టీమ్ అప్ అవుతున్నాడట. ద్విభాషా చిత్రంగా తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. 24 సినిమాతో మంచి హిట్ ను ఖాతాలో వేసుకున్న జ్నానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం.
ఇన్నాళ్లూ తెలుగు మార్కెట్ ను తమిళ హీరోలు వాడుకున్నారు. రజనీ, కమల్ హాసన్, విక్రమ్, సూర్య లాంటి వాళ్లందరూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకోగలిగారు. మనోళ్లు మాత్రం తమిళ తంబీల వైపు ఎప్పుడూ చూడలేదు. రీసెంట్ గా బాహుబలి, శ్రీమంతుడు సినిమాలతో ఈ ప్రయత్నాలు మొదలయ్యాయి. సౌత్ ఇండియా మొత్తంలో మార్కెట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నానన్న బన్నీ కూడా ఈ కారణంగానే తమిళ డైరెక్టర్ ను ఎంచుకున్నాడు. తెలుగు, మళయాళంలో ఇప్పటికే అద్భుతమైన మార్కెట్ ఉన్న బన్నీ తమిళనాడు, కర్ణాటకల్లో కూడా తన వాటాను పెంచాలని చూస్తున్నాడు. లింగుస్వామి, జ్నానవేల్ రాజా, బన్నీ కాంబినేషన్లోని ఈ హై వోల్టేజ్ సినిమా, జూలై నెలాఖరుకు మొదలవుతుందని సమాచారం.