పాతికేళ్ల తర్వాత మళ్లీ అఖిల్కి అమ్మగా...
on Sep 16, 2020
తెలుగు సినిమా తెరపై అక్కినేని నాగేశ్వరరావుది ఓ చరిత్ర. ఆయన తరవాత తనయుడు నాగార్జున ఆ నట వారసత్వాన్ని కొనసాగించారు. నాగ్ కుమారులు, మేనల్లుళ్లు కూడా హీరోలుగా వచ్చారు. అయితే, అక్కినేని ఫ్యామిలీలో మూడో తరంలో అందరి కంటే ముందుగా తెరపైకి వచ్చినది అఖిల్. పాతికేళ్ల క్రితం పసి వయసులో ‘సిసింద్రీ’ చేశాడు. అందులో అఖిల్కి అమ్మగా ఆమని నటించారు. పాతికేళ్ల తరవాత మళ్లీ వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్నారు.
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. ఇందులో ఆమని నటిస్తున్నారు. మరోసారి అఖిల్కి తల్లిగా ఆమె కనిపించనున్నారని సమాచారం. పాతికేళ్ల తరవాత ‘సిసింద్రీ’ మదర్ అండ్ సన్ కాంబినేషన్ రిపీట్ అవుతుందన్నమాట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. హీరో హీరోయిన్లు, ఇతర తారగణం మీద కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. కరోనాకి ముందు 70 శాతం సినిమా చిత్రీకరణ పూర్తయింది. మిగతా 30 శాతం ఇప్పుడు కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేశారు.