ఆది సాయికుమార్ క్రైమ్ థ్రిల్లర్ స్టార్ట్ చేశాడు!
on Oct 16, 2021
ఆది సాయికుమార్ హీరోగా ఒక క్రైమ్ థ్రిల్లర్ ప్రారంభమైంది. శివశంకర్ దేవ్ డైరెక్టర్గా పరిచయమవుతున్న ఈ మూవీని చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్పై అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. రామానాయుడు స్టూడియోస్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆదిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పుస్కూర్ రామ్మోహన్రావు క్లాప్ నివ్వగా, సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్. రామారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాతలు డి. సురేశ్బాబు, లగడపాటి శ్రీధర్ ఈ వేడుకకు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.
నిర్మాత అజయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, తమ తండ్రి శాంతయ్య గత 32 సంవత్సరాలుగా డిస్ట్రి బ్యూషన్ రంగంలో ఉన్నారని చెప్పారు. "కారంచేడు మా స్వగ్రామం . రామానాయుడుగారి ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీ కి వచ్చిన మా నాన్నగారు నేను నిర్మాతగా మారడానికి ప్రోత్సాహం అందించారు. మంచి కథను రెడీ చేసుకుంటే ప్రొడ్యూసర్ గా అవకాశం ఇస్తానన్నారు. దేవ్ చెప్పిన కథ నాకు బాగా నచ్చడంతో ఆ కథ పై ఒక సంవత్సర కాలంగా పనిచేశాం. ఆది సాయికుమార్ గారు కెరియర్ లో ఈ కథ చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. దర్శకుడు దేవ్ చాలా టాలెంటెడ్. నాకీ అవకాశం ఇచ్చిన ఆదిసాయికుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నవంబర్ రెండో వారంలో షూటింగ్ మొదలవుతుంది" అని వెల్లడించారు.
దర్శకుడు శివశంకర్ దేవ్ మాట్లాడుతూ, "ఇది ఒక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్. ఆది సాయికుమార్ గారి పాత్ర చాలా ఢిఫరెంట్ గా ఉంటుంది. ఒక కొత్త ఆది సాయికుమార్ని ఈసినిమాతో చూస్తారు. ఒక కొత్త పాయింట్ తో సినిమా రూపొందబోతుంది. దర్శకుడిగా నా ప్రయత్నం మిమ్మల్ని అందరినీ ఆనంద పరుస్తుందని నమ్ముతున్నాను." అన్నారు.
హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ, "నా కెరీర్లో ఈ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కథ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. దర్శకుడు చాలా డిటైల్డ్ గా ఈ సినిమా పై పనిచేశాడు. శాంతయ్య గారి కుమారుడు నిర్మాతగా నా సినిమాతో పరిచయం అవడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు దేవ్ నాకు రెండు సంవత్సరాలుగా తెలుసు. అందరం కథను నమ్మి ముందుకు వెళుతున్నాం. హీరోయిన్ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. దసరా రోజున నా సినిమా ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది." అని చెప్పారు.
నటుడు అలీ రజా మాట్లాడుతూ, "ఇందులో ఒక పోలీస్ పాత్రను చేస్తున్నాను. నా కెరియర్ లో ఇది ఒక మంచి పాత్రగా మిగులుతుందని నమ్ముతున్నాను. కథ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ఆది సాయికుమార్ కాంబినేషన్ లో చేయడం చాలా ఆనందంగా ఉంది." అన్నారు.
నటుడు తారక్ పొన్నప్ప మాట్లాడుతూ, "ఇందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. నా క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. నటుడిగా ఇది ఒక ఛాలెంజింగ్ రోల్ . కన్నడలో కెజియఫ్, యువరత్న సినిమాలతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ పాత్ర తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుందని నమ్ముతున్నాను." అని చెప్పారు.
ఆది సాయికుమార్, అలీ రాజా, నందిని రాయ్, తాకర్ పొన్నప్ప తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జి. శేఖర్, మ్యూజిక్: అనీష్ సాల్మన్, నిర్మాత: అజయ్ శ్రీనివాస్, దర్శకుడు: శివశంకర్ దేవ్.
Also Read